మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: ప్రొఫెసర్ కోదండరాం

by Disha Web Desk 11 |
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: ప్రొఫెసర్ కోదండరాం
X

దిశ, గద్వాల: తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టీజేఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆలూరు ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో అయన మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ప్రభుత్వ వైఫల్యం అని మండిపడ్డారు. ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ నీరుగారుస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే తమ జీవితాలు బాగుపడతాయి అనుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశలు ఆవిరిపోయాయన్నారు.

తూతూ మంత్రంగా ఉద్యోగ ప్రకటనలు చేస్తూ.. పబ్బం గడుపుకుంటున్నారని వాపోయారు. విద్యార్థి లోకం కన్నెర్ర చేయకముందే ప్రభుత్వం నిర్ణయానికి రావాలని సూచించారు. అనంతరం తెలంగాణ నాన్ గెజిటెడ్ కార్యాలయంలో 54 వ తెలంగాణ అమరవీరుల సంస్మరణసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో 317-జే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన వచ్చే వరకు అన్ని ప్రజా సంఘాలు కలిసి ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed