సోషల్ మీడియాలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ మురుగు ముచ్చట..!

by Disha Web Desk 11 |
సోషల్ మీడియాలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ మురుగు ముచ్చట..!
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: చిన్నపాటి వర్షానికి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ప్రధాన, గల్లీ రోడ్లు చిత్తడి చిత్తడిగా మారాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయ లోపంతో కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు అంతా ప్రధాన రహదారుల వెంటే పరుగులు పెడుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో టెలిఫోన్ వైర్లు, ఆయా ఇళ్లల్లో నుంచి నూతన మరుగుదొడ్డి కనెక్షన్ కోసం మిషన్ భగీరథ కనెక్షన్ల కోసం నడి రోడ్లపైనే అడ్డగోలుగా గోతులను తవ్వారు.

ఫలితంగా చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ గతుకులమయంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓ పక్క అధికార పార్టీ నేతలు డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియా వారియర్ల ద్వారా నిత్యం నాడు.. నేడు అంటూ ప్రచారం చేసుకున్నప్పటికీ చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ గతుకులుగా మారడంతో సామాన్యులే ఫోటోలు తీసి సోషల్ మీడియాలోనే ఎదురు దాడిగా సెటైర్లు వేస్తున్నారు. వారికి తోడు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగానే సెటైర్లు వేస్తున్నారు.

ఇది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్లు ఎదురు దాడికి దిగుతున్నారు. ప్రస్తుతం ఎవరు ఫోన్ తెరిచినా వాట్సాప్ , ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ మురుగు ముచ్చట్లే కనిపిస్తున్నాయి. ఇంతలా గొడవ జరుగుతున్నా అటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించకపోవడం విశేషం.

Next Story