కంటి చూపు ఎట్లుంది పెద్దాయన...? ఇక్కడేముందో కనబడుతుందా..?

by Dishanational1 |
కంటి చూపు ఎట్లుంది పెద్దాయన...? ఇక్కడేముందో కనబడుతుందా..?
X

దిశ, మిడ్జిల్: కంటి చూపు ఎట్లుంది పెద్దాయన.. పరీక్షలు చేసుకున్నారా..? అద్దాలు పెట్టుకున్నాక ఇప్పుడు దూరం చూపు దగ్గర చూపు ఎట్లా ఉంది పెద్దవ్వ.. ఈ అక్షరం ఎక్కడ మళ్లిందో చెప్పు అంటూ, మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కంటి పరీక్షల కోసం శిబిరానికి వచ్చిన వృద్ధులతో ఆత్మీయంగా పలకరించారు. అద్దాలు పెట్టుకున్నాక తమకు చూపు మంచిగా కనబడుతుందని వృద్ధులు ఎమ్మెల్యేకు తెలపడంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. దూరం, దగ్గరి చూపు సమస్యలతో బాధపడుతున్నవారికి కంటి వెలుగు శిబిరాల్లో ఉచితముగా ఇస్తున్న కళ్లద్దాలు మన తెలంగాణలోనే తయారయ్యాయని వారికి చెప్పారు.

గురువారం మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన కౌంటర్ లను, వాటి పనితీరు పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమం ఎలా ఉంద‌ని ల‌బ్దిదారుల‌ను, స్పందన ఎట్లుంది అంటూ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు శిబిరం వివ‌రాలు, ఇప్పటివ‌ర‌కు ఎంత మందికి ప‌రీక్షలు నిర్వహించారు, కండ్లద్దాలు ఎంతమందికి పంపిణీ చేశారనే విష‌యాల‌ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... దృష్టి లోపాలను దూరం చేసేందుకే కంటి వెలుగు కార్యక్రమంను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, కంటి వెలుగు శిబిరాలను 18 సంవత్సరాలు నిండిన వారందరూ కంటి పరీక్షలు చేయించుకుని కంటి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ, కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జంగయ్య, స్థానిక ఎంపీటీసీ యశోద, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు జంగారెడ్డి, వైద్యాధికారి కృష్ణ కుమార్, వైద్య సిబ్బంది దేవయ్య, జంగయ్య, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాండు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎల్లయ్య యాదవ్, జిల్లా నాయకులు బాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భీమ్రాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed