నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణను పూర్తి చేయాలి

by velandi.Saikiran |

నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు.

నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణను పూర్తి చేయాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పెండింగ్ ఆయకట్టు భూ సేకరణ పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కుడి కాలువ) భూసేకరణ పనులను వేగవంతంగా ఎటువంటి ఆలస్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రైతులకు నోటీసులు అందజేయబడినందున, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద 99/బి, 100 ప్యాకేజీలకు అనుగుణంగా మంజూరైన చెక్కులను పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని అన్నారు.

రైతులకు బకాయిలేని విధంగా మొత్తం పరిహారం చెల్లింపులు పూర్తిచేయాలని ఆదేశించారు. చెక్కులు స్వీకరించేందుకు నిరాకరించిన రైతులను ఒప్పించి,ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించి, భూసేకరణను వేగవంతం చేయడానికి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు,ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్,ఇరిగేషన్ శాఖ డి ఈ, ఏ ఈ లు,గద్వాల తహశీల్దార్ మల్లికార్జున్, ధరూర్ తహశీల్దార్ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story