విద్యార్థిని హతమార్చిన వారిని వెనకేసుకొస్తే రాజకీయ సమాధి చేస్తా: మందకృష్ణ మాదిగ

by Disha Web Desk 11 |
విద్యార్థిని హతమార్చిన వారిని వెనకేసుకొస్తే రాజకీయ సమాధి చేస్తా: మందకృష్ణ మాదిగ
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మన్ననూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని హతమార్చిన వారిని వెనకేసుకొస్తే రాజకీయ సమాధి చేస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మన్ననూర్ గురుకుల పాఠశాలలోని తరగతి గదిలో ఇద్దరు టీచర్లు ఏకాంతంగా కలుసుకున్న రాసలీల గుట్టు బయట పడుతుందన్న భయంతోనే అది చూసిన 7వ తరగతి విద్యార్థిని నిఖిత (12)ను అతి దారుణంగా హింసించబడి మృతి చెందిందని, నేరం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు, పోలీసులు వైద్యాధికారుల సంపూర్ణ సహకారంతోనే ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ప్రాంతంలో దళిత సంఘాలు, ప్రజాసంఘాలు ఇతర రాజకీయ పార్టీ నేతలతో దళిత విద్యార్థిని నిఖిత కుటుంబానికి న్యాయం కోసం ఉద్యమ కార్యాచరణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని కట్టుకత అల్లి తల్లిదండ్రులను మోసగించి, తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించామని చెప్పడం దుర్మార్గమన్నారు. ఈ నేపథ్యంలోనే తాను గురుకుల పాఠశాలను సందర్శించిన క్రమంలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయని, వాటి ఆధారంగానే రీ పోస్టుమార్టంకి ఒత్తిడి చేశామన్నారు. అందులో అనుమానించినట్లే విద్యార్థిని అత్యంత దారుణంగా దాడికి గురై చంపబడిందని రీ పోస్టుమార్టంలో ఏడు రకాల గాయాలు బయట పడ్డాయన్నారు.

కేవలం సోషల్ మీడియా ఆధారంగా తల్లిదండ్రులు విషయాన్ని గమనించారని తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడేంత పిరికిది కాదని గ్రహించి నిరసన చేపడితే పోలీసులు నిందితుల పక్షాన నిలబడి బాదితులపైనే లాఠీచార్జ్ చేసి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రీ పోస్టుమార్టం నిర్వహించిన క్రమంలోనూ పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వాలని కోరితే మీరే తెచ్చుకోవాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థిని మృతి పట్ల పోలీసులు, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్యుల తీరు పరిశీలిస్తే వారిపై రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు గుర్తించామన్నారు. దళిత విద్యార్థిని హత్య చేయపడితే ఈ ప్రాంత దళిత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జడ్పీ చైర్మన్ శాంతా కుమారి తోపాటు చివరికి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సైతం దళితులే అయినప్పటికీ దళిత కుటుంబానికి న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు.

తెరవెనుక నిందితులను రక్షించేవారు ఎంతటి వారైనా సహించేది లేదని వారికి రాజకీయ సమాధి తప్పదని పరోక్షంగా గువ్వల బాలరాజు కు హెచ్చరిక జారీ చేశారు. అన్ని పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జట్టి ధర్మరాజు, జనసేన పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అసెంబ్లీ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed