తెలంగాణలో అసమ్మతి నేతల భారీ స్కెచ్

by Disha Web Desk 12 |
తెలంగాణలో అసమ్మతి నేతల భారీ స్కెచ్
X

దిశ, ప్రతినిధి వనపర్తి: మంత్రి నిరంజన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన బిఆర్ఎస్ అసమ్మతి నేతలు ఆ పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు‌తో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఎంపీపీలు మెఘా రెడ్డి, కిచ్చారెడ్డిల వర్గం మంతనాలు జరిపి అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనిలో భాగంగానే వనపర్తిలో పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం కోసం భారీ స్కెచ్ వేశారు.

జూపల్లి రాకతో అసమ్మతి నేతల్లో జోష్..

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేరుగా ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ.. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురై బయటకు వచ్చిన సంగతి విధితమే. అయితే బిఆర్ఎస్ నుంచి బయటికి రావడం పంజరం నుంచి విడుదలైనట్టు ఉందని జూపల్లి నేరుగా అధికార పార్టీపై, మంత్రులపై విమర్శలు చేస్తూ.. దూకుడు పెంచారు. అయితే దాదాపు రెండు నెలల క్రితం బీఆర్ఎస్‌ను వీడి అసమ్మతి నేతలుగా గుర్తించబడిన జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, పెద్దమందడి, వనపర్తి ఎంపీపీలు మెఘా రెడ్డి, కిచ్చారెడ్డి వర్గీయులు ఏదో ఒక పార్టీని ఎంచుకోవడానికి తర్జనభర్జన పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో జూపల్లి కృష్ణారావు బయటకు రావడంతో వీరందరూ ఇటీవల ఆయనను కలిసి మంతనాలు జరిపినట్టుగా తెలిసింది. టీఆర్ఎస్ వ్యతిరేకులమంతా ఒక తాటిపై ఉండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని గద్దె దించడానికి కలిసికట్టుగా పని చేద్దామని జూపల్లి కృష్ణారావు పిలుపునివ్వడంతో వనపర్తి అసమ్మతి నేతల్లో జోష్ పెంచినట్లు అయింది.

మెఘా రెడ్డి వర్గం చూపు కాంగ్రెస్ వైపు...

అధికార పార్టీని వీడి నెలలు గడుస్తున్న ఏ పార్టీలో చేరకుండా ఇన్నాళ్లు వేచి ఉన్న ధోరణిలో ఉన్న పెద్దమందడి ఎంపీపీ మేఘా రెడ్డి వర్గం చివరకు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఒకవైపు బీజేపీ నుంచి వీరందరికీ పిలుపు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అయితే ఓటు బ్యాంకు అధికంగా ఉంటుందన్న ఆశతో వారు ఇన్నాళ్లు నిర్ణయం తీసుకోకుండా వేచి ఉన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీకీ చెందిన కొందరు పెద్దలు అంతర్గతంగా వనపర్తి అసెంబ్లీ టికెట్ పై మేఘారెడ్డికి హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఇది ఇలా ఉండగానే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో వారంతా ఆయన వెంటనే నడవాలని నిర్ణయించుకున్నట్లుగా అర్థమవుతోంది.

పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం..

వనపర్తికి చెందిన అసమ్మతి నేతలందరూ ఈ నెల 23 ఆదివారం రోజు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వ్యతిరేకులతో కలిపి పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కృష్ణ గార్డెన్స్‌లో నిర్వహించే ఈ సమ్మేళనానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు ఇటీవల టిఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిసింది.

ఒకటి రెండు రోజుల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆత్మీయ సమ్మేళనం గురించి వెల్లడించనున్నట్లు మెఘా రెడ్డి నేరుగా దిశకు తెలిపారు. కాగా వనపర్తి జిల్లాలో అసమ్మతి నేతల దూకుడుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తోడు జత కావడంతో వనపర్తి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం రసకందాయంలో పడినట్లు అయింది.

Next Story

Most Viewed