మార్ల‌పాడు తాండ గ్రామ‌స్తులకు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది.. ఎవ్వ‌రూ అధైర్య ప‌డొద్దు : అదనపు కలెక్టర్లు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, అచ్చంపేట : మొంథా తుఫాన్ కార‌ణంగా తీవ్ర వ‌ర్షాలు కుర‌వ‌డంతో నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట మండ‌లంలోని న‌క్క‌ల‌గండి రిజ‌ర్వాయ‌ర్ ప‌రిధిలోని మార్ల‌పాడు తండా పూర్తిగా జ‌ల‌మ‌య‌మైంది.

మార్ల‌పాడు తాండ గ్రామ‌స్తులకు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది.. ఎవ్వ‌రూ అధైర్య ప‌డొద్దు : అదనపు కలెక్టర్లు
X

దిశ‌, అచ్చంపేట : మొంథా తుఫాన్ కార‌ణంగా తీవ్ర వ‌ర్షాలు కుర‌వ‌డంతో నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట మండ‌లంలోని న‌క్క‌ల‌గండి రిజ‌ర్వాయ‌ర్ ప‌రిధిలోని మార్ల‌పాడు తండా పూర్తిగా జ‌ల‌మ‌య‌మైంది. సుమారు 350 కుటుంబాలు, 638 మంది జ‌నాభా ఉన్న ఈ గ్రామం వ‌ర‌ద జ‌లాలు చుట్టు ముట్ట‌డంతో ప్ర‌జ‌ల‌ను అధికారులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. శుక్ర‌వారం నిర్వాసితుల వ‌ద్ద‌కు రెవెన్యూ అద‌న‌పు క‌లెక్ట‌ర్ పి.అమ‌రేంద‌ర్, స్థానిక సంస్థ‌ల అద‌న‌పు క‌లెక్ట‌ర్ దేవ‌స‌హాయం, విద్యుత్, రెవెన్యూ, పంచాయ‌తీ రాజ్ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి గ్రామాన్ని సంద‌ర్శించి న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు ప‌రిశీలించారు. అక్టోబర్ 28న రాత్రి నుంచి 29వ తేదీ మధ్యాహ్నం వరకు కురిసిన అతి భారీ వర్గానికి జల దిగ్బంధంలో గ్రామం చిక్కుకొని గ్రామస్తులను సిద్దాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి అధికారులు తరలించి భోజన వసతి, వైద్య సదుపాయాన్ని కల్పించారు.


నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని నక్కలగండి రిజర్వాయర్ పరిధిలోని మార్లపాడు పర్యటనలో అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి, పంట నష్టం, గృహ నష్టం, ప్రజల అవసరాలపై వివరాలు సేకరించారు. ముంపు నీరు తగ్గిన అనంతరం పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని డ్రైనేజీలలో పూడికతీత, చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లడం, దోమల మందు పిచికారి వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే పనులు ప్రారంభించారు. పంట నష్టాలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపి, బాధితులకు సహాయం అందిస్తామని అదనపు కలెక్టర్లు హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం, నీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వచ్చే రెండు మూడు రోజులు కూడా భోజన వసతి కొనసాగించనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు భయపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలను వివరించగా, వాటిని తక్షణం పరిష్కరించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, తహ‌శీల్దార్ సైదులు, ఎంపీడీవో, విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story