పాలమూరుకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

by Disha Web Desk 11 |
పాలమూరుకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కొల్లాపూర్ లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరు జిల్లా విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్ కళాశాల ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరుకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి అదే రోజు కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పాలమూరు జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే మెడికల్, నర్సింగ్ , పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు కాగా.. ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలెక్టరేట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై ఉత్తర్వుల కాపీని మీడియాకు అందజేశారు. ఇంజనీరింగ్ కళాశాలను సువిశాలమైన ప్రాంతంలో నిర్మించి వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. అడిగిన వెంటనే ఇంజనీరింగ్ కళాశాల కేటాయించడం పట్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story