ఎస్టీ మైన‌ర్ బాలిక పై సామూహిక అత్యాచారం

by Nallavelli.Anjaneyulu |

ఎస్టీ మైన‌ర్ బాలిక పై సామూహిక అత్యాచారం చేసిన ఘట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ఉప్పునుంత‌ల మండ‌ల ప‌రిధిలోని మామిళ్ల‌ప‌ల్లి గ్రామంలో అర్థ‌రాత్రి చోటు చేసుకుంది.

ఎస్టీ మైన‌ర్ బాలిక పై సామూహిక అత్యాచారం
X

దిశ‌, ఉప్పునుంత‌ల : ఎస్టీ మైన‌ర్ బాలిక పై సామూహిక అత్యాచారం చేసిన ఘట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ఉప్పునుంత‌ల మండ‌ల ప‌రిధిలోని మామిళ్ల‌ప‌ల్లి గ్రామంలో అర్థ‌రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మామిళ్ల‌ప‌ల్లి గ్రామంలో ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆల‌యం వ‌ద్ద చెన్న‌కేశ‌వ స్వామి నాట‌క ప్ర‌ద‌ర్శ‌న ముగించుకొని ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా.. మైన‌ర్ బాలిక పై అదే గ్రామానికి చెందిన ఇద్ద‌రు యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. గిరిజ‌న మైన‌ర్ బాలిక పై జ‌రిగిన అఘాయిత్యం గ్రామంలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. గ్రామంలో ప్రతి సంవత్సరం ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.


ఉత్సవాల్లో భాగంగా ఆలయం ముందు ప్రతిరోజూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అదే క్రమంలో రాత్రి ఆలయం వద్ద నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి నాటకం చూడడానికి బాధిత బాలిక కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. అర్ధరాత్రి సమయంలో బాలికకు దాహం వేయడంతో ఆలయం సమీపంలోనే ఉన్న తమ ఇంటి నుంచి నీళ్లు తీసుకురమ్మని కుటుంబ సభ్యులు పంపించారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి నోరు మూసి సమీపంలోని ఒక టెంట్ హౌస్ రేకుల షెడ్డులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నిందితులలో ఒకరు ముగ్గురు పిల్లల తండ్రి, వివాహితుడని, అందులో ఒకరు బల్మూర్ మండలంలోని సింగిల్ విండో బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాపను అపురూపంగా పెంచుకున్నామని ఆమెను చిత్రహింసలకు గురి చేసి దాడి చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత బాలిక తెలకపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు.

Next Story