కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. ఆ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్ల రాజీనామా!

by Dishafeatures2 |
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. ఆ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్ల రాజీనామా!
X

దిశ, ప్రతినిధి వనపర్తి : కాంగ్రెస్ పార్టీ తరపున వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ దఫా ఎన్నికలో మాజీమంత్రి చిన్నారెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ వనపర్తి మున్సిపాలిటీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కాంగ్రెస్ కార్యకర్త లక్కాకుల సతీష్ నివాసంలో పదవ వార్డు కౌన్సిలర్ జయసుధ మధు గౌడ్, 31వ వార్డు కౌన్సిలర్ బండారు రాధాకృష్ణ, 21వ వార్డు కౌన్సిలర్ బాపనిపల్లి వెంకటేష్, 14వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మంచారిలు రాజీనామా పత్రాలపై సంతకాలు చేసి విలేకరులతో మాట్లాడారు. చిన్నారెడ్డి అంటే తమకి ఎంతో గౌరవం ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కష్టమన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తన్నారని, అందుకే తాము కూడా ప్రజల బాటలో నడుస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

తాము రెండు రోజుల క్రితమే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డామన్న వాళ్లు.. స్వయంగా చిన్నారెడ్డి తమకు ఫోన్ చేసి తాను బరి నుంచి తప్పుకుంటానని చెప్పారని అన్నారు. అయితే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని చెబుతానన్న చిన్నారెడ్డి.. అయితే ఇచ్చిన మాట ప్రకారం చిన్నారెడ్డి రాకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము పార్టీని వీడినా కాంగ్రెస్ తరఫునుంచి ఎమ్మెల్యే ఎన్నికల్లో బలమైన కొత్త అభ్యర్థిని పోటీలో నిలబెడితే మేమంతా వారి ఉంటే ప్రచారం చేసి గెలిపిస్తామని తెలిపారు. కాగా పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లకు పీసీసీ డెలిగేట్, మాజీ డీసీసీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, పీసీసీ మాజీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సంఘీభావం తెలిపారు. తమ రాజీనామా పత్రాలను

మాజీ డీసీసీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ కు అందజేసిన కౌన్సిలర్లు.. ప్రస్తుత అధ్యక్షుడైన చిన్నారెడ్డికి కూడా రాజీనామా పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా శంకర్ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇప్పటికే చిన్నారెడ్డి 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారని, అందులో 4 సార్లు గెలిచారని గుర్తు చేశారు. ఇంకెంత కాలం వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. చిన్నారెడ్డికి హటావో కాంగ్రెస్ కో బచావో అనే నినాదంతో తాము ఉన్నామని, ఈ దఫా ఎన్నికల్లో కొత్త వ్యక్తికి మద్దతు పలుకుతామని చెప్పారు. త్వరలోనే పదివేల మంది నాయకులు, కార్యకర్తలను ఒక చోటికి సమీకరించి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


Next Story

Most Viewed