ఎన్నికల ప్రవర్తన నియామావళి పకడ్బందీగా అమలు చేయాలి : అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

by Ratna Kumari |

దిశ, గద్వాల కలెక్టరేట్ : జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణను నిబంధనల ప్రకారం పకడ్బందీగా

ఎన్నికల ప్రవర్తన నియామావళి పకడ్బందీగా అమలు చేయాలి : అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఎన్నికల అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సంబంధిత ఎన్నికల నిర్వహణ అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియామవళి పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావలిని కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పక్కాగా అమలు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా నోడల్ అధికారులతో పాటు మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహశీల్దార్లు, SHO లు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, జిపిఓలు విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారన్నారు. ఎక్స్పెండిచర్ అధికారులు, సర్వే లైన్స్ టీమ్స్, తదితర బృందాలను కూడా నియమించి ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వీరందరికీ ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, ఏ చిన్న తప్పిదం జరగకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుందన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ నేతల విగ్రహాలకు మాస్కులు వేయించాలని, పోస్టర్స్, బ్యానర్స్ గుర్తించి తొలగించాలన్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం, ప్రచార సమయం, అభ్యర్థుల ఖర్చు వివరాలు నమోదు చేయడం వంటి అన్ని విషయాలపై సమగ్రంగా దృష్టి సారించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సంబంధించి ఏ పని చేసినా నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వివరాలను అందజేయాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా దృష్టి సారించాలన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకునే విధంగా చూడాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంసిసి నిబంధనలు పాటించేలా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తుండాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ గత ఎన్నికల అనుభవాలను, సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసే వరకు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డీవో అలివేలు,డీఎస్పీ మొగులయ్య, డిపిఓ నాగేంద్రం, నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

Next Story