అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తే అద్భుతమైన ఫలితాలు : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

by Disha Web Desk 20 |
అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తే అద్భుతమైన ఫలితాలు : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
X

దిశ ప్రతినిధి, నారాయణపేట : అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని జీపీ శెట్టి ఫంక్షన్ హాల్ లో జిల్లా శిశుసంక్షేమ, మహిళా అభివృద్ధి శాఖ కార్యక్రమాల పై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకుంటే సమాజంలో ఉన్న చాలా ఆరోగ్య సమస్యలను అరికట్టవచ్చన్నారు. సమాజంలో చాలా మందికి రక్తహీనత, అనారోగ్యం, అవసరమైన చురుకుదనం తెలివితేటలు వంటి రుగ్మతలతో బాధపడుతుంటారని, ఈ అనారోగ్య రుగ్మతలను అరికట్టడానికి అంగన్వాడీ కేంద్రంలో సేవలు అందిస్తున్నారన్నారు.

గర్భిణీలకు గుడ్లు, పౌష్టికాహారం, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, సమయానికి టీకాలు ఇప్పించడం ప్రసవం తర్వాత 6 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం, టీకాలు, ఆటపాటల ద్వారా విద్య నేర్పుతూ పాఠశాలకు వెళ్లి చదువుకోడానికి మానసికంగా పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో సిద్ధం చేస్తున్నారన్నారు. ఇలా ఎదిగిన పిల్లలు భవిష్యత్తులో చాలా హుషారుగా తెలితేటలతో విద్యలో రాణిస్తారన్నారు. జిల్లాలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు చాలా బాగా పనిచేస్తున్నారని వారి సేవలను ప్రశంసించారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములై ముందుకు వస్తే ఎంత మంచి అద్భుతాలు సాధించగలమో పల్లెప్రగతి, పట్టణ ప్రగతిలో చూశామన్నారు. అందుకే సమాజాహితం కోసం ఇంత మంచి సేవలు అందిస్తున్న అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేసే సద్వినియోగం చేసేందుకు ప్రజాప్రతినిధులు స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు.

ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబంలో తల్లిపాత్ర ఎంత ఉందో సమాజంలో అంగన్వాడీల పాత్ర కూడా అంతే ఉందని సరిపోల్చి చెప్పారు. నారాయణపేటలో పనిచేసిన అధికారులంతా ఒక యజ్ఞంలా పనిచేస్తున్నారని, వీరి కృషివల్లనే నారాయణపేట అనతి కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేట, మెదక్ తర్వాత నారాయణపేట జిల్లా మూడవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని ప్రజాప్రతినిధులందరూ సహకరించి అంగన్వాడి సేవలను అర్హులైన వారికి అందేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన అన్ని మౌళిక వసతులు కల్పించి సేవలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఏ గ్రామ పంచాయతికి అంగన్వాడీ భవనం అడిగిన తన నిధుల నుండి రూ .15 లక్షలు ఇచ్చారని తెలిపారు. ఇంకా ఎవరైనా అడిగిన అంగన్వాడీ కేంద్రం కోసం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎక్కడైన అనాధ పిల్లలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అనాధ పిల్లలను గురుకులాల్లో సీటు కల్పించి చదివిస్తామని తెలియజేసారు.

ప్రతి బుధవారం 10 నిమిషాల అంగన్వాడీ సమావేశంలో పాల్గొనండి..

అంగన్వాడీ కేంద్రాలను సందర్శించడం, ప్రతి బుధవారం 10 నిమిషాల అంగన్వాడీ సమావేశంలో పాల్గొని సమస్యలు తెలుసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. వాటిని అధికారులతో సమన్వయ పరుచుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తే తక్కువ సమయంలోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని తీసుకురావచ్చని ఆయన తెలిపారు. ఇందుకు జిల్లాలోని ఏ అంగన్వాడీ కేంద్రంలో అయినా సరే ప్రజాప్రతినిధులు మౌళిక వసతులు కల్పించేందుకు ముందుకువస్తే వారు ఖర్చు చేసే మొత్తంలో సగం నిధులు తన సీబీఎఫ్ నిధుల నుండి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీ సేవలను ప్రతిగ్రామంలో, ప్రతి వార్డులో సద్వినియగం చేసుకునేందుకు కృషి చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనుసూయ, వైస్ చైర్మన్ హరినారాయన్ భట్టడ్, జడ్పీ వైస్ చైర్మన్ సురేఖ, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, పంచాయతీ సెక్రటరీలు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ సేవలు అందించిన వారికి అభినందన..

ఉత్తమ సేవలు అందించిన కొత్తపల్లి అంగన్వాడీ టీచర్, విద్యాశాఖలో పని చేస్తున్న పద్మజా, సఖి కేంద్రం లీగల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కవిత, జిల్లా సంక్షేమ శాఖ ఉద్యోగిని భారతిలను కలెక్టర్, ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.


Next Story

Most Viewed