ఆదాయం ఉంటేనే అభివృద్ధి సాధ్యం: కలెక్టర్ ఉదయ్ కుమార్

by Disha Web Desk 11 |
ఆదాయం ఉంటేనే అభివృద్ధి సాధ్యం: కలెక్టర్ ఉదయ్ కుమార్
X

దిశ, కల్వకుర్తి: మున్సిపాలిటీలో ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని, ఆదాయం ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. ఆశ్రిత్ కుమార్ మున్సిపాలిటికి సంబంధించి 2021-22, 2022-23 సంవత్సరానికి వచ్చిన ఆదాయం, వ్యయంతో పాటు 2023-24 సంవత్సరానికి బడ్జెట్ అంచనా ఆదాయం, వ్యయం పై రూపొందించిన నివేదికను సభ్యులకు చదివి వినిపించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆదాయ వనరులు పెంచుకోవాలని అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఏ మున్సిపాలిటీ అయిన రుణాలు తీసుకోవడం సహజమని అయితే తీసుకున్న రుణాలపై ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీలో కొత్తగా కలిసిన గ్రామ పంచాయతీలు, కొత్తగా ఏర్పడిన కాలనీలపై ఎక్కువ శ్రద్ధ పెట్టి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు చేయాలన్నారు రోడ్లు, డ్రైన్ లు, తాగునీటి వసతి కల్పన వంటి మౌలిక వసతులు ప్రధాన ఎజెండాగా ఉండాలన్నారు.

మున్సిపాలిటీ సపాయి కర్మచారిల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం మాట్లాడుతూ పారిశుధ్యం, షాపింగ్ కాంప్లెక్స్, సమీకృత మార్కెట్ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరారు. స్మశాన వాటిక ఏర్పాటుకు కనీసం 3 ఎకరాల స్థలం అవసరం ఉందని తెలియజేసారు. మున్సిపాలిటీ అభివృద్జికి సమన్వయంతో కృషి చేస్తామని తెలియజేసారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మోహమ్మద్ షాహీద్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed