అసైన్డ్ భూములను కాపాడుకునేందుకు పోరాటం..సీఎల్పీ నేత

by Disha Web Desk 20 |
అసైన్డ్ భూములను కాపాడుకునేందుకు పోరాటం..సీఎల్పీ నేత
X

దిశ, నవాబుపేట : రాష్ట్రంలోని పేద ప్రజల నుండి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్న 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పరులపాలు కానివ్వకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి రూపకల్పన చేస్తున్నామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విరామంలో భాగంగా మండల పరిధిలోని రుక్కంపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్న విక్రమార్క స్థానిక విలేకరులతో ' ఇష్టాగోష్టి ' మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన పాదయాత్ర ముఖ్య ఉద్దేశాన్ని గురించి వివరించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకుదెరువు కోసం పంచిన అసైన్డ్ భూములను వారి నుండి బలవంతంగా లాక్కొని ఆమెజాన్ లాంటి ధనవంతమైన బహుళజాతి సంస్థలకు అతితక్కువ ధరలకు విక్రయించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్లు చేసి అసైన్డ్ భూములను అమ్మడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు.

పేదల నోటికాడే భూములను ప్రభుత్వం లాక్కోవడం ఎంత మాత్రం సమస్తము కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన అనేక చర్యలకు పాల్పడుతూ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆయన ఆయన దుయ్యబట్టారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలను చైతన్యవంతులను చేసి వారితో కలిసి పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. తాను నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగిన రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. పాదయాత్ర ముగిసిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఇష్టాగోష్టిలో భట్టి సోదరుడు మల్లురవి, ఉబేదుల్లా కొత్వాల్, ప్రదీప్ కుమార్, అనిరుద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story