రాష్ట్రానికి అవార్డులు.. సర్పంచులకు అప్పులా.. రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచుల తిరుగుబాటు

by Disha Web Desk 11 |
రాష్ట్రానికి అవార్డులు.. సర్పంచులకు అప్పులా.. రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచుల తిరుగుబాటు
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి అవార్డులు రాగా, సర్పంచులకు మాత్రం అప్పులే మిగిలాయని పలువురు సర్పంచులు అన్నారు. గ్రామ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎస్టీఓలో పెండింగ్ లో ఉన్న చెక్కులను వెంటనే క్లియర్ చేసి నిధులు విడుదల చేయాలని తదితర డిమాండ్లతో నారాయణపేట జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో శనివారం చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి అడిషనల్ కలెక్టర్ మయాంక్ కు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి మాట్లాడుతూ అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తే బిల్లులు చెల్లించక సర్పంచ్ లను సీఎం కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. గత 8 నెలల నుంచి గ్రామాల్లో చేసిన పనుల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మన ఊరు మనబడి, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, స్మశానవాటికలు, రైతు వేదికలు, ట్రాక్టర్లకు డీజిల్ పోసిన బిల్లులు కూడా ఇవ్వటం లేదని సర్పంచులు వాపోయారు. ఎస్ఎఫ్ సీ, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బిల్లులు కూడా ఇవ్వటం లేదన్నారు.

8 నెలల నుంచి ఎస్టీవోలో చెక్కులు ఫ్రీజింగ్ లో ఉన్నాయన్నారు. పనులు చేయమని వెంటపడిన అధికారులు బిల్లులు అడుగుతే ముఖం చాటేస్తున్నారని వాపోయారు. వెంటనే బిల్లులు చెల్లించకపోతే రాబోయే 8 రోజుల్లో కార్యాచరణ మొదలుపెడతామని అన్నారు. అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed