గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

by Disha Web Desk 21 |
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఐబి బంగ్లా వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జడ్చర్ల మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న కావేరమ్మపేటకు చెందిన జహంగీర్ (38) తన ద్విచక్ర వాహనంతో జాతీయ రహదారిపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో జహంగీర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గాయపడిన జహంగీర్‌ని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతరం ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగానే జహంగీర్ మృతి చెందాడు. దీంతో జాహంగీర్ కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఈ ఘటనపై జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కొరకు అన్వేషిస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. తమతోపాటు రోజు మున్సిపాలిటీలో విధులు నిర్వహించే తోటి అవుట్సోర్సింగ్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న తోటి కార్మికులు విషాదంలో మునిగిపోయారు.


Next Story