అమ్రాబాద్ లో గంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి క్రయ, విక్రయాలు జరుగుతున్నాయని పోలీసుల‌కు స‌మాచారం అందింది.

అమ్రాబాద్ లో గంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి క్రయ, విక్రయాలు జరుగుతున్నాయని పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో పోలీసులు రైడింగ్ చేసి గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకొని సీఐ శంకర్ నాయక్ ఆదేశాలతో పూర్తి విచారణ చేప‌ట్టారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన‌ట్టు ఎస్సై హ‌నుమంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయ‌న మీడియాకి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన నోముల అభి గౌడ్ హైదరాబాద్ లోని దూల్ పేట వ‌ద్ద‌ గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేసి అక్రమంగా మండల కేంద్రంలో కొంతమంది యువతకు అమ్మకాలు చేస్తున్నాడని తెలిపారు.

ఈ క్రమంలో స్థానికులైన సయ్యద్, ఈ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన కొర్ర విక్రమ్ ఆటో డ్రైవర్, కొర్ర శ్రీకాంత్ ఆటో డ్రైవర్, కొర్ర పవన్ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి, చంద్రకంటి అనిల్ మాధవాని పల్లి గ్రామాలకు చెందిన యువకులు నోముల అభి గౌడ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న‌టువంటి వారికి అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతున్నారు. సుల‌భంగా డబ్బు సంపాదించేందుకు వీరు త‌ప్పుడు మార్గాల‌ను ఎంచుకున్న‌ట్టు విచార‌ణ‌లో నిర్థారించిన‌ట్టు తెలిపారు. నోముల అభిగౌడ్ ప‌రార‌య్యాడు. 6 మంది పై కేసు న‌మోదు చేశామ‌ని.. ఐదుగురిని రిమాండ్ కి త‌ర‌లించిన‌ట్టు ఎస్సై హ‌నుమంత్ రెడ్డి తెలిపారు. ప్ర‌ధాన నిందితుడు నోముల అభిగౌడ్ ఆచూకి కోసం గాలింపు చేపడుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాలను అమ్మకాలు, కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని ఎస్సై సూచించారు.

Next Story