మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌

by Naga Rani Yarlagadda |

తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగానే కాకుండా గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి

మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌
X
  • ప్రెసిషన్ ఇంజినీరింగ్ పరిశ్రమలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులు
  • గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌గా తెలంగాణ
  • లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్ ప్రారంభం

దిశ, తెలంగాణ బ్యూరో: తయారీ రంగంలో మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ప్రెసిషన్ ఇంజినీరింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగానే కాకుండా గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. గురువారం ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లోని ఆజాద్ - సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌లో గురువారం 7,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ది ఎక్స్ క్లూజివ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బేకర్ హ్యూస్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు.

ఒకప్పుడు రక్షణ పరిశోధన సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే నిలయమైన హైదరాబాద్.. నేడు ప్రైవేట్ రంగంలోనూ ప్రెసిషన్ ఇంజినీరింగ్‌ పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిందన్నారు. అంతేకాకుండా.. 1500లకు పైగా ఎంఎస్ఎంఈలతో హై ప్రెసిషన్ మాన్యూఫ్యాక్చరింగ్‌లోనూ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్నదన్నారు. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, ఎయిర్‌బస్, హనీవెల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజాలు సైతం తమ కార్యకలాపాలను విస్తరించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి ఇక్కడి ఎకో సిస్టం కారణమన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ఈ పరిశ్రమతో కొత్తగా 230 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి వివరించారు. కార్యక్రమంలో బేకర్ హ్యూస్ ప్రతినిధులు డేవిడ్ మర్రానీ, స్టీఫెన్ హిన్సన్, మార్సెల్లో బారియాని, రోసానో చియెల్లి, మాసిమిలియానో తుర్సీ, మౌరో బ్రాకో, విశాల్ ముర్గుడ్కర్, లియో డి ఫిలిప్పో, ఆజాద్ ఇంజనీరింగ్ ఛైర్మన్, సీఈవో రాకేష్ చోప్దార్, టీజీఐఐసీ ఎండీ శశాంక తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు స్మారకార్థం కళావేదిక సాంస్కృతిక సంస్థ రూపొందించిన ప్రత్యేక సావనీర్‌ను సెక్రెటేరియట్‌లో ఆవిష్కరించారు. అలాగే.. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు మృతిచెందడంతో ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు.

Next Story