బీజేపీలో చేరిన జయప్రకాష్ నారాయణ సోదరుడు

by Disha Web Desk 2 |
బీజేపీలో చేరిన జయప్రకాష్ నారాయణ సోదరుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'నేను నిన్ను పొగుడుతా.. నువ్వు నన్ను పొగుడు అన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ల తీరు ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ విమర్శించారు. గతంలో ఢిల్లీ వెళ్లి వెళ్లిన కేసీఆర్ బస్తీ దవాఖానాలను భేష్ అని పొగిడి వస్తే ఇప్పుడు తెలంగాణకు వచ్చిన పంజాబ్ సీఎం కేసీఆర్‌ను పొగుడుతున్నాడని ఎద్దేవా చేశారు. గురువారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సోదరుడు నాగేంద్ర బాబు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినంత మాత్రాన తెలంగాణ ప్రజల కష్టాలు, పరిస్థితులు మారలేదని కేసీఆర్ సర్కార్ చేసిన మోసాన్ని ప్రజలు మరిచిపోరని అన్నారు.

కేసీఆర్ నదులకు నడక నేర్పాడా? లిక్కర్‌కు నడక నేర్పాడా? అని విమర్శించారు. లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలు కురుకుపోయాయని ధ్వజమెత్తారు. పంజాబ్ సీఎంకు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను కలవనిస్తే కేసీఆర్ బండారం ఏంటో బయట పడేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన 70 శాతం మందికి ఇంకా పరిహార దక్కలేదన్నారు. కొండగట్టు నుంచి కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని, తెలంగాణ భక్తులు హుండీలో వేసింది కాకుండా ఆలయాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు ఎన్నో వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొండగట్టుకు వంద కోట్లు విడుదల చేస్తే ప్రజలు ఇచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తోందని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ నేతలు హిందూ దేవతలను కించపరిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం వారితోనే చెట్టాపట్టాలేసుకు తిరుగుతోందన్నారు. కేసీఆర్ చిన్నజీయర్ స్వామిని అవసరానికి వాడుకుని వదిలేశారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల్లో ప్రభుత్వ పాత్ర లేకుండా భక్తులకు ప్రాధాన్యత ఉండేలా చేస్తామన్నారు.

కమలం గూటికి లోక్ సత్తా అధినేత సోదరుడు:

లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ సోదరుడు నాగేంద్ర బాబుకు కే.లక్ష్మణ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగేంద్ర బాబు బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తాను రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నానని కంపెనీలో కాదని అన్నారు. తన ఆలోచనలు, అభిప్రాయాలకు బీజేపీ సరైన వేదిక కావడం వల్లే బీజేపీలో చేరుతున్నారన్నారు. కాగా తన సోదరుడు లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ గతంలో మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిచారు. ఓ దశలో జేపీకి గవర్నర్ పోస్ట్ దక్కపోతోందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో ఆయన సోదరులు నాగేంద్ర బాబు అనూహ్యంగా బీజేపీ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



Next Story

Most Viewed