ఆపరేషన్ కగార్‍పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్లుండి లోక్ సభలో అమిత్ షా సంచలన ప్రకటన?

by Prasad Jukanti |   (  Updated:2026-03-28 09:22:44  IST  )

ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో లోక్‌సభలో కీలక చర్చకు కేంద్రం సిద్ధమైంది. అగ్రనేత గణపతి లొంగుబాటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆపరేషన్ కగార్‍పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్లుండి లోక్ సభలో అమిత్ షా సంచలన ప్రకటన?
X

దిశ,డైనమిక్ బ్యూరో: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ డెడ్‌లైన్ దగ్గర పడింది. ఈ నెల 31 వరకు భారత్‍ను మావోయిస్టు రహిత దేశంగా మార్చుతామంటూ ప్రకటించిన కేంద్రం.. ఈ ఆపరేషన్ ద్వారా మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే మూడు రోజుల్లో గడువు సమీపిస్తున్న వేళ ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల సంగతి ఏంటి? వారు లొంగిపోబోతున్నారా..? లేదా..? అనే సందేహాలు తలెత్తుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిజాన్ని తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై లోక్‌సభలో (Lok Sabha) కీలక చర్చ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్లుండి (ఈ నెల 30) లోక్‌సభలో ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ జరపబోతున్నది. లోక్‌సభ కార్యకలాపాల నింబంధన 193 ప్రకారం స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని లోక్‌సభ సభ్యులు శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే, బైరెడ్డి శబరి స్పీకర్‌కు నోటీసులు ఇచ్చారు. వీరి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా ఎల్లుండి చర్చ జరపనున్నట్లు సమాచారం ఇచ్చారు. దీంతో ఆపరేషన్ కగార్, మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

గణపతి కోసం ఆఖరి ప్రయత్నం?

2024 జనవరిలో ప్రారంభించిన ఆపరేషన్ కగార్ (Operation Kagar) మావోయిస్టు పార్టీని పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది. ఈ ఆపరేషన్ మొదలు పెట్టాక మునుపెన్నడూ లేని విధంగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో చనిపోగా పార్టీ ముఖ్యనేతలు చాలా మంది లొంగుబాట పట్టారు. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ ముంచుకు వస్తుండటంతో ఇంకా మిగిలిన మావోయిస్టుల పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత గణపతి (Ganapathi) అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు, పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్ బెస్రాతో పాటు మిగిలి మావోయిస్టు కేడర్ సంగతి ఏంటనే డిస్కషన్ వస్తోంది. ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో గణపతి సరెండర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు ఆయన తెలంగాణ పోలీసులను సంప్రదిందిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఎల్లుండి లోక్‌సభలో చర్చకు ముందే ఏ క్షణంలోనైనా ఆయన లొంగుబాటు ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బెస్రా, ఆయన అనుచరుల కోసం కోబ్రా దళాలు జార్ఖండ్‌లోని సరండా అటవీ ప్రాతంలో 15 వేల మంది సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ జవాన్లు జల్లెడ పడుతున్నారు. అడవి చుట్టూ జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సైతం పెద్దఎత్తున గాలిస్తున్నాయి. దీంతో లోక్‌సభలో చర్చ జరిగేలోపు సరెండర్లు ఉండబోతున్నాయా లేక ఎన్‌కౌంటర్లు ఉంటాయా అనేది ఉత్కంఠగా మారింది.

Next Story