బతుకమ్మ ప్రాముఖ్యతను చాటిచెబుదాం.. క‌వులు, క‌ళాకారుల‌కు మంత్రి జూప‌ల్లి పిలుపు

by Kema Shiva Kumar |

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుక‌ సందర్భంగా పూల పండ‌గ‌ ప్రాముఖ్యతను, మహిళల ఐక్యతను, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియ‌జేసేలా క‌వులు, క‌ళాకారులు, గాయ‌కులు రచనలు, ప్రదర్శనలు చేయాల‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.

బతుకమ్మ ప్రాముఖ్యతను చాటిచెబుదాం.. క‌వులు, క‌ళాకారుల‌కు మంత్రి జూప‌ల్లి పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుక‌ సందర్భంగా పూల పండ‌గ‌ ప్రాముఖ్యతను, మహిళల ఐక్యతను, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియ‌జేసేలా క‌వులు, క‌ళాకారులు, గాయ‌కులు రచనలు, ప్రదర్శనలు చేయాల‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధ‌వారం టూరిజం ప్లాజాలో క‌వులు, క‌ళాకారులు, గేయ ర‌చ‌యిత‌లు, గాయ‌కులు, సాంస్కృతిక స‌ల‌హా మండ‌లి స‌భ్యులు, త‌దిత‌రుల‌తో మంత్రి జూప‌ల్లి స‌మావేశ‌మ‌య్యారు. అంబ‌రాన్ని అంటేలా బతుక‌మ్మ సంబ‌రాలు జ‌రిపేలా ప్రభుత్వం ప్రణాళిక‌లు రూపొందించింది. ఈ క్రమంలో కవులు, కళాకారులు తమ రచనల ద్వారా, కళారూపాల ద్వారా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను, బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ముందు తరాలకు పరిచయం చేసేలా కృషి చేయాల‌న్నారు.

బతుకమ్మ విశిష్టత‌, ప్రకృతిని ప‌రిర‌క్షించేందుకు పువ్వులను పూజించే సంస్కృతి, గౌరమ్మ శక్తిని, మహిళల ఆశలను, ఆకాంక్షలను వివరించేలా పాట‌లు రాయాల‌ని కోరారు. బతుకమ్మ పండుగకు సంబంధించిన ప్రత్యేక పాటలు, వీడియోలను రూపొందించాల‌ని సూచించారు. కవుల, కళాకారుల రచనలు, ప్రదర్శనలు ప్రజలలో బతుకమ్మ పట్ల అవగాహనను పెంచుతాయని, పండుగను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాకుండా, సమాజంలో స్ఫూర్తిని నింపుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ స‌మావేశంలో ప్రొఫెస‌ర్ కోదాండ‌రాం, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి, ప్రముఖ ద‌ర్శకులు న‌ర్సింగ‌రావు, సినీ గేయ ర‌చ‌యిత సుద్ధాల అశోక్ తేజ‌, సాంస్కృతిక స‌ల‌హా మండ‌లి స‌భ్యులు, క‌వులు, క‌ళాకారులు, జాన‌ప‌ద గాయ‌కులు పాల్గొన్నారు.

Next Story