DK Aruna: కవితను బీజేపీలో చేర్చుకోవడంపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

కవిత రాసిన సీక్రెట్ లేఖపై పొలిటికల్ దుమారం రేగుతోంది.

DK Aruna: కవితను బీజేపీలో చేర్చుకోవడంపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తండ్రికి రాసిన రహస్య లేఖ ఎలా బయటకు వచ్చిందో ఫాదర్, డాటర్, సన్ కే తెలియాలి అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ముందు దినపత్రికల్లో లేఖ దిగింది.. ఆ తర్వాత అమెరికా నుంచి కవిత దిగిందని ఆమె రాసిన లేఖ ఎవరు లీక్ చేశారో వాళ్లకే తెలియాలన్నారు. వారి కుటుంబం లేదా సన్నిహితులే ఈ పని చేసి ఉండాలన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో కవితనే చెప్పాలన్నారు. ఎవరింట్లో దయ్యాలు ఉన్నాయో వెళ్లి తొంగిచూస్తామా అంటూ ఎద్దేవా చేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన డీకే అరుణ.. కవితను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి తీసుకోమన్నారు. పార్టీలో చేరుతామనే వాళ్లెవరో చూసి చేర్చుకుంటామన్నారు. పార్టీలోకి ఎవరు రావాలో వారినే ఆహ్వానిస్తామని అన్ వాంటెడ్ గెస్టులను ఆహ్వానించేది ఉండదన్నారు.

అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తక్కువ సమయంలోనే ప్రజాభిమానం కోల్పోయిందని విమర్శించారు. కేసీఆర్ అభివృద్ధి పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదని ఈ రెండు పార్టీల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంటే దాన్ని జీర్ణించుకోలేని ఈ రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు.

Next Story