ప్రాణం పోయినా అన్యాయం జరగనివ్వ.. RRRపై మంత్రి కోమటి‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టు అలైన్‌మెంట్‌పై రైతులు రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కీలక ప్రకటన చేశారు.

ప్రాణం పోయినా అన్యాయం జరగనివ్వ.. RRRపై మంత్రి కోమటి‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టు అలైన్‌మెంట్‌పై రైతులు రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిపుల్ ఆర్ ప్రాజెక్టు అలైన్‌మెంట్ పూర్తిగా సిద్ధం కాలేదని అన్నారు. ఇప్పటి వరకు కేవలం DPR‌ మాత్రమే పూర్తి అయిందని తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళనలు, ధర్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తన ఊపిరి ఉన్నంత వరకు ఎవరికీ అన్యాయం జరగనివ్వనని కామెంట్ చేశారు. 2018లో కేంద్రం ఆమోదించిన రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం (KCR Government) ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. రిజీనల్ రింగు రోడ్డు ప్రాజెక్టులు భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం మరింత పెంచుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

కాగా, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌లో కాంగ్రెస్ సర్కార్ చేసిన మార్పులు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా దక్షిణ భాగమైన సంగారెడ్డి-ఆమనగల్లు-షాద్ నగర్-చౌటప్పల్ మధ్య దూరం 189 కి.మీ. నుంచి 198 కి.మీలకు చేరింది. అదేవిధంగా ప్రాజెక్టు వ్యయం కూడా రూ.20 వేల కోట్లకు పెరిగింది. ఈ పరిణామంతో సుమారు 20 వేల ఎకరాల సారవంతమైన భూములను రైతులు కోల్పోతున్నారు. కొత్త అలైన్‌మెంట్‌తో రేవంత్ సర్కార్ ప్రైవేట్ కంపెనీల భూములను కాపాడుతూ.. చిన్న రైతులను లక్ష్యంగా చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పును మునుగోడు, చౌటప్పల్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, గాజ్వేల్ జిల్లాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Next Story