టీ- కాంగ్రెస్‌లో కొత్త స్ట్రాటజిస్ట్.. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అనూహ్యంగా తెరపైకి..!

by Satheesh |
టీ- కాంగ్రెస్‌లో కొత్త స్ట్రాటజిస్ట్.. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అనూహ్యంగా తెరపైకి..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో కొత్త స్ట్రాటజిస్టు ఎంటర్ అయ్యారు. గడిచిన ఎనిమిది నెలలుగా గ్రౌండ్ వర్క్ చేస్తూ, పార్టీకి సక్సెస్ పుల్ ఫార్ములాను అందిస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ స్ట్రాటజిస్టుగా పనిచేస్తున్న సునీల్ కనుగోలుకు సమాంతరంగా ఈయన వర్క్ చేస్తున్నారు. పార్టీలో చేరికలు, పాపులర్ సర్వే, అధికార పార్టీ తప్పిదాలపై కౌంటర్లు, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక స్పీచ్ కాపీలన్నీ ఈయన ఆధ్వర్యంలోనే రెడీ అవుతున్నాయి. హైకమాండ్‌కు అతి సన్నిహితమైన వ్యక్తితో పాటు నమ్మకంగా పనిచేస్తున్నట్లు పార్టీ లీడర్లు చెబుతున్నారు. గడిచిన 8 నెలలుగా ఈ స్ట్రాటజిస్టు ఇస్తున్న సలహాలు, సూచనలను పార్టీ నేతలంతా తు.చ తప్పకుండా పాటించడం గమనార్హం. 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచేందుకు కృషి చేస్తున్న స్ట్రాటజిస్టు.. శుక్రవారం గాంధీభవన్‌లో ప్రత్యక్షమయ్యారు.

‘‘మిషన్ తెలంగాణ –2023” ప్రోగ్రామ్‌కు చీఫ్​గెస్టు‌గా వచ్చిన వ్యూహకర్త.. ముఖ్య కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నికల్లో వ్యహరించాల్సిన తీరుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. ఈవీఎంలను ఎలా పరిశీలించాలి? ఫారమ్ 2 బీ, ఫారమ్ 26 లు పవర్స్ ఏమిటీ ? ప్రచార వాహనాలకు ఎలా పర్మిషన్ తీసుకోవాలి? ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లను ఎలా నిర్వహిస్తే పబ్లిక్‌లో మైలేజీ వస్తుంది? ఓటర్ లిస్టు, మ్యాపింగ్, తప్పిదాలు గుర్తించడం, డోర్ టూ డోర్ క్యాంపెయిన్, ఈవీఎంల పనితీరును పరిశీలించడం, పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు అవగాహన ఫిర్యాదులు ఎలా ఇవ్వాలి? వంటి అంశాలన్నింటిపై క్షుణ్ణంగా వివరించారు.

ఎవరీ కొత్త వ్యక్తి..?

సునీల్ కనుగోలుకు ఏ మాత్రం తగ్గకుండా కొత్త స్ట్రాటజిస్టు తన రిపోర్టులను ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కుమ్మరి శ్రీకాంత్ పార్టీ నూతన స్ట్రాటజిస్టుగా పనిచేస్తున్నారు. ఢిల్లీలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీకాంత్ సెఫాలజీ కోర్సును కూడా అక్కడే చేశారు. గతంలో ఢిల్లీలోనే వివిధ ప్రైవేట్ సంస్థలకు తన సర్వేలను అందజేశారు. 2012 నుంచి కాంగ్రెస్ పార్టీకి పార్ట్ టైమ్ స్ట్రాటజిస్టు‌గా కొనసాగిన శ్రీకాంత్.. గడిచిన ఎనిమిది నెలలుగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం వర్క్ చేస్తున్నారు.

స్థానికుడు కావడంతో రాష్ట్ర పరిస్థితులపై శ్రీకాంత్‌కు పూర్తి స్థాయిలో పట్టు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. దీంతోనే ఆయన ఇచ్చే నివేదికలు, సర్వేలను రాష్ట్ర పార్టీ పూర్తిగా నమ్ముతున్నది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల తర్వాత నుంచి కొత్త స్ట్రాటజిస్టు రిపోర్టును పరిగణలోకి తీసుకొని పార్టీ ముందుకు వెళ్తున్నది. స్టేట్ ముఖ్య లీడర్లు కూడా ఈయన సలహాలు, సూచనలను తీసుకుంటున్నారు. గాంధీభవన్‌కే పరిమితమైన లీడర్లను తన దైన శైలీలో చెప్పడంతో ఆయా నేతలంతా నియోజకవర్గాల్లో గెలుపు కోసం పనిచేస్తున్నారు.

యూత్ టార్గెట్‌గా..

కాంగ్రెస్ పార్టీ విధానాలు, గ్యారంటీలను సోషల్ మీడియా వేదికగా ఎక్కువ మందికి చేరవేసేందుకు స్ట్రాటజిస్టు శ్రీకాంత్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రా, ట్విట్టర్ తదితర ప్లాట్ ఫామ్‌లలో కాంగ్రెస్ పార్టీని పబ్లిసిటీ చేస్తున్నారు. గ్యారంటీలు, పార్టీ విధానం, ప్రభుత్వం తప్పిదాలన్నీ ఈ రూమ్ నుంచే పోస్టులు పెడుతున్నారు. ఈ రూమ్‌లో ఎక్సపర్ట్ టీమ్, లీగల్, సోషల్, ట్రైనింగ్, రీసెర్చ్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 21 ఏళ్లలో 86 శాతం మంది ఇన్ స్టా గ్రామ్‌లు వాడుతున్నట్లు శ్రీకాంత్ టీమ్ సర్వేలో తేలింది. దాదాపు 5.06 లక్షల మంది వివిధ సోషల్ ప్లాట్ ఫామ్‌లు వాడుతున్నట్లు వార్ రూమ్ ఇన్ చార్జీ తెలిపారు.

Next Story

Most Viewed