సొంత లీడర్లకు కేటీఆర్ వార్నింగ్.. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దని సూచన

by Disha Web Desk 2 |
సొంత లీడర్లకు కేటీఆర్ వార్నింగ్.. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దని సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను ఓడించి ప్రజలు తప్పు చేశారని అక్కడక్కడా పార్టీ శ్రేణులు ప్రజలతో సంభాషిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అలా మాట్లాడటం, ప్రజా తీర్పును గౌరవించకపోవడం కరెక్ట్ కాదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు బంపర్ మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని ఏ బీఆర్ఎస్ కార్యకర్త, నాయకుడు కూడా మర్చిపోవద్దని చెప్పారు.

బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించలేదని.. కేవలం కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు ఫలితాల్లో భిన్నత్వాన్ని చూయించారని అన్నారు. ఎందుకిలా జరిగిందో విశ్లేషించుకోవాలని అన్నారు. కొంతమంది కాంగ్రెస్‌కు ఓటు వేసి.. కేసీఆర్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని అడుగుతున్న విషయం ఆలోచింపచేసిందని తెలిపారు. కచ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో భిన్న ఫలితాలు రావడం నిరాశపరిచిందని ఆవేదన చెందారు. గెలుస్తామనుకున్న 14 నియోజకవర్గాలు కూడా గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా వుండేదని అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed