మరి వాటికి డబ్బులు ఎలా?.. బడ్జెట్‌ కేటాయింపుపై కేటీఆర్ సీరియస్

by Disha Web Desk 2 |
మరి వాటికి డబ్బులు ఎలా?.. బడ్జెట్‌ కేటాయింపుపై కేటీఆర్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్‌ కేటాయింపులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుందని అన్నారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని అన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించిందని చెప్పారు. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే 50 వేల కోట్ల పైన అవుతుందని గుర్తుచేశారు. మరి రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. వీటిపైనా బడ్జెట్‌లోనూ క్లారిటీ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.

ఫార్మసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వలన రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అభివృద్ధి దెబ్బతింటే, రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉన్నదని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపైన దృష్టి పెట్టకుండా, కేవలం ప్రజలను తప్పు దోవ పట్టించే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలను ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరని హితవు పలికారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి.. రాజకీయ కారణాలతో అవకాశం రాకున్నా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారని కార్పొరేటర్లను కేటీఆర్ అభినందించారు. ప్రతి ఒక్క కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషి వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందని అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో ప్రతిరోజు పార్టీ కార్పొరేటర్లు ప్రజల్లో నిలబడి మరీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా చూశారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగకుండా, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు కాకుండా ఆపుతుందని మండిపడ్డారు. రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఐదు అంచెల పరిపాలన వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన స్థానిక ప్రభుత్వం జీహెచ్ఎంసీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని సూచించారు. కార్పొరేటర్లు తమకున్న అధికారులను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed