విచారణ కాదు.. ఇది ప్రతీకారం.. కేసీఆర్‌కు నోటీసులపై స్పందించిన కేటీఆర్

by Ramesh Naini |

చావునోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

విచారణ కాదు.. ఇది ప్రతీకారం.. కేసీఆర్‌కు నోటీసులపై స్పందించిన కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చావునోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వండంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ అని, సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ అని కొనియాడారు.

ఇది విచారణ కాదు..

అలాంటి నాయకుడికి అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అని తెలిపారు. ఇది విచారణ కాదు.. ఇది ప్రతీకారం.. ఇది న్యాయం కాదు.. ఇది రాజకీయ దురుద్దేశం.. అని కేటీఆర్ ఆరోపించారు.

కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడన్నారు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం.. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు.. ప్రజల తీర్పుతోనే రాస్తారు.. కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story