KTR: జనతా గ్యారేజ్ లా బీఆర్ఎస్ మారింది.. ఎల్కతుర్తిలో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasad Jukanti |

ఎల్కతుర్తి సభా ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు.

KTR: జనతా గ్యారేజ్ లా బీఆర్ఎస్ మారింది.. ఎల్కతుర్తిలో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అస్థిత్వాన్ని హిమాలయాల స్థాయికి తీసుకుపోయిన ఘనత కేసీఆర్ ది అని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా, తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ ఓ జనతా గ్యారేజీలా మారిందన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని కేటీఆర్ పరిశీలించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వరంగల్ లో అనేక మహాసభలు నిర్వహించుకున్నామని బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వరంగల్ మళ్లీ వేధికైందన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 40 వేల వాహనాలు వచ్చినా పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని, పది లక్షల వాటర్ బాటిల్స్, పది లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఎటు వైపు నుంచి వచ్చే వాహనాలకు అటు వైపే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దాదాపు 100 డాక్టర్స్ టీమ్స్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోంది:

కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ పై నమ్మకం లేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. వీళ్లను నమ్ముకుంటే ఏదో రకంగా మోసం చేస్తారని అందుకే సభా నిర్వహణ కోసం 200 జనరేటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ చరిత్రలో ఎల్కతుర్తి సభ
(Elkaturthi Sabha)
అతిపెద్ద బహిరంగ సభ కాబోతున్నదన్నారు. కేసీఆర్ ను చూసేందుకు ఆయన మాట వినేందుకు గ్రామగ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. రైతులు ఎండ్లబండ్లపై సభకోసం తరలివస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను, బీజేపీ పార్టీ తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ఈ సభలో కేసీఆర్
(KCR)
వివరిస్తారని చెప్పారు. ఏప్రిల్ 27న రాష్ట్రంలోని 12,796 గ్రామ పంచాయతీలో ఎక్కడికక్క పార్టీ జెండాను ఆవిష్కరించి ఈసభ కోసం పార్టీ దండు కదిలిరావాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ యాంత్రాంగం ఈ సభకు సహకరించిందని సభ పూర్తయ్యేవరకు సహకారం ఉంటుందని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. . ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి జరుగుతున్న సభ కాదని శాంతియుతంగా బీఆర్ఎస్ వార్షికోత్సవం చేసుకుంటున్నామన్నారు.
పహెల్గం మృతులకు నివాళి:

ఈ సందర్భంగా పహెల్గం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

Next Story