సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొండారెడ్డి పల్లి సర్పంచ్, వార్డు సభ్యులు

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన స్వగ్రామమైన కొండారెడ్డి పల్లి సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్యతో పాటు వార్డు సభ్యులు, గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొండారెడ్డి పల్లి సర్పంచ్, వార్డు సభ్యులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన స్వగ్రామమైన కొండారెడ్డి పల్లి సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్యతో పాటు వార్డు సభ్యులు, గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు అయిన కొండారెడ్డిపల్లిలో సర్పంచ్‌గా మల్లెపాకుల వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అందరూ సమష్టిగా పని చేయాలని సూచించారు.

కాగా, ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మల్లేపాకుల వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మాజీ మావోయిస్టు కావడం గమనార్హం. 1994లో కొండారెడ్డిపల్లిలో మావోయిస్టులు సమావేశం నిర్వహించి పాటలు పాడుతున్న తరుణంలో ఆకర్షితుడై వారి పార్టీలో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, గంగన్న, పాన్‌గల్‌దళంలో 2000 వరకు చురుగ్గా పనిచేశారు. 2001లో వెంకటయ్య కల్వకుర్తి పోలీసుల సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.

2003లో కల్వకుర్తి పోలీసుస్టేషన్‌లోనే హోంగార్డుగా ఎంపికై తాజాగా నిర్వహించిన ఎన్నికల వరకు పనిచేశారు. కొండారెడ్డిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన హోం గార్డు ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచిగా నామినేషన్‌ వేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి వెంకటయ్య సన్నిహితుడు.. ఈ మేరకు సీఎం చొరవతో గ్రామస్తులు వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Next Story