తెలంగాణ బీజేపీ విచిత్రమైన పరిస్థితిలో ఉంది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
తెలంగాణ బీజేపీ విచిత్రమైన పరిస్థితిలో ఉంది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత జైలుకెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారని, కానీ కవిత అరెస్టు కాకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన ఒప్పందం ఉందని ప్రజలు అనుకుంటున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవితను అరెస్టు చేయలేకపోవడం వల్లే తెలంగాణలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని, అందుకే బీజేపీపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఒక్కసారే స్పీడ్‌గా దూసుకువెళ్లడం లేదని, అలా అని మరీ నెమ్మదిగా కూడా వెళ్లడం లేదని పేర్కొన్నారు. కానీ, ఎన్నికల సమయంలో ఇప్పుడున్న స్పీడ్ సరిపోదని ఆయన వెల్లడించారు.

పార్టీలో కొన్ని మార్పులు రావాలని, అంతేకానీ పార్టీ ఎన్నడూ కిందపడిపోలేదనే విషయాన్ని సైతం గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలో అనుకున్న దానికంటే బీజేపీ స్పీడ్‌గా దూసుకెళ్తోందని ఆయన తెలిపారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని ఢీ కొట్టేది తామే అని సీరియస్‌గా చెప్పగలగాలని, వారిని ఢీకొట్టే పార్టీ బీజేపీయేనని మరింత స్పష్టంగా చెప్పగలిగినప్పుడే ప్రజల్లో నమ్మకం కుదురుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రజలకు బీజేపీపై కొంత నమ్మకం ఏర్పడిందని, కానీ ఎన్నో కారణాల వల్ల ఇది తగ్గుతూ వచ్చిందని ఆయన చెప్పారు. కవిత అరెస్టు తమ చేతిలో లేదని, ఈడీ, సీబీఐ చేతిలో ఉందని కొండా పేర్కొన్నారు. కానీ ఆమె జైలుకెళ్తే బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ ఒక్క అంశం వల్లనే పార్టీ బ్లేమ్ అవుతోందని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

గతంలో కొందరు తమ పార్టీ నేతలే ఆమె జైలుకు వెళ్తుందని వ్యాఖ్యానించారని, కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో తమపై విమర్శలు వస్తున్నాయని చెప్పారు. ఈటల రాజేందర్ ఎన్నికల సమయంలో చాలా గట్టిగా పనిచేశాడని, ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తున్నాడన్నారు. జాయినింగ్ కమిటీ మాత్రం చాలా స్లో అయిందని కొండా అన్నారు. కానీ ఈ కమిటీలో ఉన్న తాను, ఈటల మాత్రం స్లో కాలేదని, అయినా బీజేపీలో ఎవరూ జాయిన్ అయ్యేందుకు ముందుకు రావడం లేదన్నారు. పొంగులేటి, జూపల్లి, పలువురు కాంగ్రెస్ నేతలతో తాము మాట్లాడామని, కానీ కేసీఆర్ విషయంలో సీరియస్ గా ఉన్నారా? లేరా? అని వారు ప్రశ్నించినప్పుడు తాము సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుండబద్దలుకొట్టారు.

ఇవి కూడా చదవండి:

సొంత పార్టీ నేతలే నాపై ట్రోల్స్ చేయిస్తున్నారు.. MP ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed