Kishan Reddy: హిందువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పు.. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి డిమాండ్

by Prasad Jukanti |

హిల్ట్ పాలసీపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Kishan Reddy: హిందువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పు.. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతులకు ఒక న్యాయం, పారిశ్రామిక వేత్తలకు మరొక న్యాయమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సహకారం అందించకుండా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హిల్ట్ పాలసీ కోసం వేసిన కమిటీ సచివాలయంలో ఉండి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. హిల్ట్ పాలసీని (Hilt policy) ఆదరాబాదరగా తీసుకురావడం వెనుక బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఉందని ఆరోపించారు. పారిశ్రామికవాడలో పని చేస్తున్న వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలేదన్నారు. అక్కడ పని చేస్తున్న లక్షలాది మంది కార్మికుల భవిష్యత్ ఏమిటో ప్రభుత్వం ఆలోచించిందా అని నిలదీశారు.

మరో బెంగళూరు చేద్దామనుకుంటున్నారా?:

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అనేక మౌలిక సమస్యలు ఉన్నాయని ఇప్పుడు హిల్డ్ పేరుతో నగరంలో 9 వేల ఎకరాల్లో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మిస్తే జరగబోయే పరిణామాలను సీఎం అంచనా వేశారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ ను మరో బెంగళూరుగా మార్చాలని చూస్తున్నారా అని నిలదీశారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కారణంగా పెట్టుబడులు వెనక్కి పోయాయని, ఇండస్ట్రీలు తరలిపోతున్నాయని హైదరాబాద్ ను కూడా ఇదే పరిస్థితిలోకి తీసుకురావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎక్స్ పర్ట్స్ తో చేయాల్సిన పనులను ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మన దురదృష్టం కొద్దీ గత పదేళ్లు ఈ రాష్ట్రంలో ఏకైక మేధావిని అంటూ కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు మరొక మేధావి రేవంత్ రెడ్డి వచ్చారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి:
కాంగ్రెస్ పార్టీ హిందువులను హిందూ దేవుళ్లను అవమానించే కార్యచారణగా పెట్టుకున్నట్లుందని కిషన్ రెడ్డి విమర్శించారు. హిందూ దేవుళ్లను అవమానించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి
(CM Revanth Reddy)
చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెంటనే బేషరతుగా యావత్ హిందు సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ వెటకారంగా మాట్లాడితే ప్రజలు ఏ రకంగా తీర్పు ఇచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు.
Next Story