మేడారం పర్యటనలో కిషన్ రెడ్డి మరో కీలక ప్రకటన.. ఆదివాసీల్లో తీవ్ర అసంతృప్తి!

by Disha Web Desk 2 |
మేడారం పర్యటనలో కిషన్ రెడ్డి మరో కీలక ప్రకటన.. ఆదివాసీల్లో తీవ్ర అసంతృప్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా వన దేవతలను దర్శించుకొని ప్రధాని మోడీ తరపున మొక్కులు చెల్లించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. రేపు చాలా మంది కేంద్ర మంత్రులు వన దేవతల దర్శనం కోసం మేడారం రాబోతున్నారని ప్రకటించారు. మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. అయితే, అనేక మంది మేడారాన్ని జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నట్లు గుర్తుచేశారు. జాతీయ పండుగ అనేది ఎక్కడా లేదని.. ఈ మహా జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అంతేకాదు.. వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ ఏడాది నుంచే ప్రవేశాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. వర్సిటీ భవనాలకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చేత శంకుస్థాపన చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఇక్కడ యూత్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కిషన్ రెడ్డి ప్రకటనపై స్థానికుల్లో అసహనం వ్యక్తమైంది. సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించలేమని కిషన్ రెడ్డి ప్రకటనలతో ఆదివాసీల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. బీఆర్ఎస్ హయాంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఇదే అంశంపై విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. తాజాగా.. జాతీయ పండుగగా గుర్తించలేమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయడంతో గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


Next Story