అతి పిన్న వయస్కుడికి అరుదైన చికిత్స చేసిన నిమ్స్ వైద్యులు

by Disha Web Desk 4 |
అతి పిన్న వయస్కుడికి అరుదైన చికిత్స చేసిన నిమ్స్ వైద్యులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అరుదైన మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడికి నిమ్స్ యూరాలజిస్ట్ వైద్యులు విజయవంతంగా మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని దశకు చేరుకున్న సమయంలో బాలుడికి మెరుగైన జీవితం అందించారు. అత్యంత అరుదైన మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న ఆ బాలుడికి మూత్రపిండ మార్పిడిని విజయవంతంగా నిర్వహించి బాలుడికి కొత్త జీవితాన్ని అందించారు. మహబూబ్ నగర్‌కు చెందిన బాలుడు 6వ తరగతి చదువుతున్నాడు.

బాలుడి తల్లిదండ్రులు పేదవారు. తండ్రి కూలీ పనులు చేసుకుంటుండగా తల్లి కొడుకు ఆరోగ్యం చూసుకుంటూ ఇంటిపట్టునే ఉండేది. అయితే ఈ బాలుడు బైలేటరల్ వెసికోర్టెరిక్ రిఫ్లక్స్ అనే మూత్రనాళ సమస్యతో బాధపడుతున్నాడు. ఇది పుట్టుకతో వచ్చే సమస్య. దీంతో కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఏడాది క్రితం నుంచి డయాలసిస్ మీదే బాలుడు బతుకుతున్నాడు. నిమ్స్ డాక్టర్స్ పూర్తిగా బాలుడి పరిస్థితిని పరిశీలించి రెండు స్టేజుల్లో చేయాలసిన ప్రొసీజర్‌కు ప్రణాళిక రూపొందించారు. మొదట ఎడమ నెఫ్రోర్రెక్టమీ‌ని తర్వాత కుడి నెఫ్రోర్రెక్టమీ‌ని లాప్రోస్కోపిక్ ద్వారా శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత రెండవ దశలోనే మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సని విజయవంతంగా చేశారు నిమ్స్ యూరాలజీ నిపుణులు.

ఆపరేషన్ తర్వాత బాలుడి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. మూత్రపిండాల పనితీరు సాధారణ స్థితికి చేరుకుంది. సీరమ్ క్రెటినైన్ స్థాయిలు కూడా 7 నుంచి 0.4 కు తగ్గినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక కొడుకుకు కిడ్నీని దానం చేసిన బాలుడి తల్లి ఆరోగ్యం కూడా బాగుందని డాక్టర్లు తెలిపారు. నిమ్స్ యూరాలజి డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత చిన్న వయసు బాలుడికి ఇలాంటి సర్జరీ జరగడం ఇదే మొదటిసారన్నారు. బాలుడి చికిత్సకయ్యే ఖర్చులన్నీ తెలంగాణ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశామన్నారు. తమకు ప్రోత్సాహన్నిందిస్తున్న తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, నిమ్స్ డైరక్టర్ డాక్టర్ బీరప్ప గారికి నిమ్స్ యూరాలజీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది.

డాక్టర్ దేవరాజ్ తో పాటు యూరాలజిస్ట్‌లు డాక్టర్ రామ్ రెడ్డి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ చరణ్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ వినయ్, డాక్టర్ సునిల్, డాక్టర్ అరుణ్, డాక్టర్ విష్ణు, డాక్టర్ హర్ష, డాక్టర్ జానకి, డాక్టర్ పవన్, డాక్టర్ సూరజ్, డాక్టర్ పూవర్సన్, డాక్టర్ అనంత్, డాక్టర్ షారూక్ లు విజయవంతంగా బాలుడి శస్త్రచికిత్సను పూర్తి చేశారు. వీరికి అనస్తీసియాలజీ నిపుణులైన డాక్టర్ నిర్మల, డాక్టర్ ఇందిర, డాక్టర్ కిరణ్, షిబానీతో పాటు నెఫ్రాలజిస్ట్ లైన డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ గంగాధర్, డాక్టర్ భూషన్ రాజులు సాయమందించారు. అయితే అరుదైన చికిత్స చేసిన బాలుడికి కొత్త జీవితాన్ని ఇచ్చిన వైద్య బృందాన్ని మంత్రి హరీశ్ రావు అభినందించారు.

Next Story

Most Viewed