రేపే సీఎం కేసీఆర్ జన్మదినం.. పోటాపోటీ ర్యాలీలకు సిద్ధమైన రెండు వర్గాలు..?

by Disha Web Desk 11 |
రేపే సీఎం కేసీఆర్ జన్మదినం.. పోటాపోటీ ర్యాలీలకు సిద్ధమైన రెండు వర్గాలు..?
X

దిశ, వైరా: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా వైరా బీఆర్ఎస్ లోని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు వేర్వేరుగా పోటాపోటీగా బైక్ ర్యాలీలు చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ పోటా పోటీ ర్యాలీలు వైరా పోలీసులకు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. ముందుగా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే అనుచరులు విలేకరుల సమావేశం నిర్వహించి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కొణిజర్ల మండలం తనికెళ్ళ గ్రామంలో బైక్ ర్యాలీ ప్రారంభిస్తామని వారు స్పష్టం చేశారు. బైక్ ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

ఆ మేరకు ఎమ్మెల్యే అనుచరులు ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే సీఎం జన్మదిన సందర్భంగా శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే భానోత్ మదన్ లాల్ వర్గీయులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు మదన్ లాల్ వర్గీయులు కూడా జన సమీకరణ చేస్తున్నారు. మదన్ లాల్ వర్గీయుల ర్యాలీ కూడా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయడం విశేషం. శుక్రవారం ఉదయం 9 గంటలకు తనికెళ్లలో తమ ర్యాలీ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే అనుచరులు ప్రకటించారు. అదే సమయానికి తనికెళ్ల గ్రామం నుంచే మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గీయులు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.

దీంతో ఒకే గ్రామంలో ఒకే సమయానికి రెండు వర్గాల వారు బైక్ ర్యాలీలు నిర్వహిస్తే వర్గ విభేదాలు తారాస్థాయి చేరడంతో పాటు, ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం వైరా పోలీస్ శాఖకు తలనొప్పిగా మారనుంది. అయితే వైరా పోలీస్ శాఖ తనికెళ్లలో ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే అనుచరుల ర్యాలీ ప్రారంభించేందుకు అనుమతినిచ్చారు. ఎమ్మెల్యే అనుచరుల ర్యాలీ ముగిసిన తర్వాత ఉదయం 11 గంటల లకు తనికెళ్లలో మదన్ లాల్ వర్గీయుల ర్యాలీ ప్రారంభించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.

అయితే మదన్ లాల్ వర్గీయులు తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో తనికెళ్లలో ఉదయం 9 గంటలకే బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని తమ నాయకులు, కార్యకర్తలకు సందేశం పంపారు. దీంతో ర్యాలీల సందర్భంగా శుక్రవారం ఎప్పుడు ఎలాంటి వాతావరణం నెలకొంటుందో అని స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతుంది. పోలీసు శాఖ అనుమతుల ప్రకారం తమకు కేటాయించిన సమయంలో బీఆర్ఎస్ లోని రెండు వర్గాల వారు ర్యాలీలు నిర్వహిస్తారా.. లేదా పంతాలకు వెళ్లి పోటా పోటీగా ఒకే సమయంలో ర్యాలీలు ప్రారంభిస్తారా..? వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఈ పోటా పోటీ ర్యాలీలు వైరా పోలీసులకు తలనొప్పిగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Next Story

Most Viewed