ఇవెక్క‌డి రూల్స్ న‌య‌నా..ఉదయం 5 గంటలకే బార్లు ఓపెన్ !

by velandi.Saikiran |   (  Updated:2026-05-25 20:30:20  IST  )

సత్తుపల్లిలో బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాపులు విక్రయాల్లో టార్గెట్లే లక్ష్యంగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.

ఇవెక్క‌డి రూల్స్ న‌య‌నా..ఉదయం 5 గంటలకే బార్లు ఓపెన్ !
X

అంతా.... మా ఇష్టం

వైన్‌షాపుల టార్గెట్ ఆరునెలలకే పూర్తి

విచ్చలవిడిగా బెల్టుషాపులకు మద్యం తరలింపు

ఉదయం 5 గంటలకే బార్ అండ్ రెస్టారెంట్ల ఓపెన్

సత్తుపల్లి పట్టణంలో బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాపుల నిర్వహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మద్యం విక్రయాలు, షాపుల ఓపెన్‌పై ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పట్టణంలో సుమారు వంద వరకు బెల్టుషాపులు నడుస్తుండగా, మండలం పరిధిలో మరో వంద నడుస్తున్నట్లు తెలుస్తున్నది. వైన్‌షాపుల వారు టార్గెట్లే లక్ష్యంగా పెద్దమొత్తంలో మద్యాన్ని బెల్ట్‌షాపులకు తరలిస్తున్నారు. మద్యంషాపుల ఏడాది టార్గెట్లను ఆరు నెలల్లోనే పూర్తి చేశారంటే వైన్‌షాపుల నుంచి బెల్ట్‌షాపులకు తరలింపు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు ఉదయం 11గంటలకు తెరవాల్సి ఉన్నా.. కానీ 5గంటలకే ఓపెన్ చేస్తున్నారు. నాణ్యమైన మద్యం విక్రయించాల్సిన చోట రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి దోచుకుంటున్నారు.

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలో బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాపులు మద్యం విక్రయాల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. టార్గెట్లే లక్ష్యంగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పెద్దమొత్తంలో మద్యాన్ని బెల్ట్‌షాపులకు తరలిస్తూ... కోట్లాది రూపాయలను మద్యం వ్యాపారులు కొల్లగొడుతున్నారు. ఇంతా జరుగుతున్నా సత్తుపల్లి ఎక్సైజ్‌శాఖ మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సత్తుపల్లిలోని బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు నిబంధనలను బేఖాతరు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.

బెల్టుషాపులకే మద్యం..

వైన్‌షాపు నుంచి బెల్ట్‌షాపులకు మద్యం రవాణా ఆంక్షలు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా మద్యంషాపుల ఏడాది టార్గెట్లను ఆరు నెలల్లోనే పూర్తి చేశారు. దీన్ని బట్టి సత్తుపల్లిలో వైన్‌షాపుల నుంచి బెల్ట్‌షాపులకు మద్యం విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని వందకు పైగా బెల్ట్ షాపులు నిర్వహిస్తుండగా, మండలం పరిదిలోని మరొక 100కు పైగా బెల్ట్‌షాపులు నడుస్తున్నట్లు తెలుస్తున్నది. పట్టణంతో పాటు మండలంలోని గుడి, బడి, మసీదు, చర్చి అనే తేడా లేకుండా వాటి సమీపంలోనే రాత్రింబగళ్లు మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

ఉదయం 5గంటలకే..

సత్తుపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం5గంటల నుంచి అర్ధరాత్రి వరకు విక్రయాలు కొనసాగిస్తున్నారు. నిబంధన ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉదయం 11గంటలకు తెరవాలి. కానీ ఐదు గంటలకే తెరుచుకోవడంతో పాటు పట్టణంలో మైనర్లకు సైతం జోరుగా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లో చీప్ లిక్కర్, ఓఏబీ అమ్మకాలు కొనసాగించరాదు. కానీ రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి చీప్ లిక్కర్ రూ.110 ఉంటే రూ.140, ఓఏబీ రూ.140 ఉంటే రూ.180కి విక్రయిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే వారికి కోరిన ఫుడ్ అందించాలని నిబంధనలో ఉన్నా ఏదో నామమాత్రంగా ఉంటుందనని తెలుస్తున్నది.

తనిఖీలేవి..?

సత్తుపల్లి పట్టణంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలను కొనసాగిస్తున్నా.. గ్రామ గ్రామాలలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి పట్టణంలోని వైన్‌షాపుల నుంచి విచ్చలవిడిగా మద్యం తరలిస్తున్నా.. ఎక్సైజ్ శాఖ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాపుల నిర్వహణపై కనీసం ఆరు నెలలకు ఒకసారి క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సి ఉన్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇప్పటికైనా సత్తుపల్లి ఎక్సైజ్‌శాఖ అధికారులు, జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story