వైరా మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం.. అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

by Disha Web Desk 12 |
వైరా మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం.. అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి జైపాల్‌ను ఆ పదవి నుంచి తొలగించేందుకు బీఆర్ఎస్ పార్టీ బిగ్‌ స్కెచ్‌ వేసింది. అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు తమకు తగిన సంఖ్యా బలం ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీ తమలో కలుపుకుంది.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించడంతో వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్‌తో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు పొంగులేటి శిబిరంలో చేరారు. వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లలో గతంలో 18 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు.

అయితే జైపాల్‌తో పాటు మరో ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పొంగులేటి శిబిరంలో చేరడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 14కు తగ్గింది. అయితే ఇటీవల వైరాలో నియోజకవర్గ స్థాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో చైర్మన్ సూతకాని జైపాల్ ప్రసంగిస్తూ బీఆర్ఎస్‌కు దమ్ము, ధైర్యం ఉంటే నా చైర్మన్ పదవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ సవాల్ విసిరారు.

అయితే తనవెనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్‌ను జైపాల్ హెచ్చరించారు. చైర్మన్ జైపాల్ సవాల్ విసరడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి సీరియస్‌గా తీసుకుంది. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో వైరా మున్సిపాలిటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఈ సమావేశంలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం మున్సిపాలిటీ కౌన్సిలర్లతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రత్యేక అంతరంగిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ చెందిన 14 మంది కౌన్సిలర్లతోపాటు కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పాల్గొనటం విశేషం. 16 మంది కౌన్సిలర్లు అభిప్రాయాలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వ్యక్తిగతంగా సేకరించారు.

సుమారు 5 గంటల సేపు ఈ సమావేశం వాడివేడిగా నడిచింది. ఈ సమావేశంలో వైరా మున్సిపాలిటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ సమక్షంలో 16 మంది కౌన్సిలర్లు నిర్ణయించారు. వైరాలోని ఓ వార్డుకు చెందిన మహిళా కౌన్సిలర్ ప్రస్తుత చైర్మన్‌ను ఆ సీట్లో ఒక్కరోజు కూడా కూర్చోనివ్వకూడదని ఆగ్రహంతో ఆమె అభిప్రాయాన్ని వెలబిచ్చినట్లు తెలిసింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కలెక్టర్‌కు ఇచ్చే వినతిపత్రంపై 16మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా కౌన్సిలర్లు కలెక్టరేట్‌కి వెళ్లారు. వైరా మున్సిపాలిటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు సోమవారం రాత్రి వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఆధ్వర్యంలో 16 మంది కౌన్సిలర్లు వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ అధిష్టానం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసంపై వెనకడుగు వేయకూడదని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

16 మంది కౌన్సిలర్లు చేజారకుండా ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్ ఆ కౌన్సిలర్లకు ముందుగానే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఏదిఏమైనా మున్సిపాలిటీ చైర్మన్‌పై బీఆర్ఎస్ కౌన్సిలర్లతోపాటు, కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి అవిశ్వాస తీర్మానం కోసం నిర్ణయం తీసుకోవడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరికంటి డెడి కుమారి, బత్తుల గీత, ఎదునూరి పద్మజ, మాదినేని సునీత, లగడపాటి లక్ష్మీరాజ్యం, సూర్యదేవర వింధ్యారాణి, కర్నాటి నందిని, దారేల్లి పవిత్ర కుమారి, వనమా విశ్వేశ్వరరావు, ముళ్ళపాటి సీతారాములు, దారేల్లి కోటయ్య, గుడిపూడి సురేష్, తడకమళ్ల నాగేశ్వరరావు, చల్లగుండ్ల నాగేశ్వరరావు, దనేకుల వేణు, ఇమ్మడి రామారావు తదితరులు పాల్గొన్నారు.



Next Story