పొంగులేటికి అడ్రెస్ లేదు: ఎమ్మెల్యే రాములు నాయక్

by Disha Web Desk 1 |
పొంగులేటికి అడ్రెస్ లేదు: ఎమ్మెల్యే రాములు నాయక్
X

దిశ, వైరా: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అడ్రెస్ లేదని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం వైరాలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీ వద్ద నుంచి మధిర క్రాస్ రోడ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ, కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిభిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ పొంగులేటికి ఆయన రాజకీయ జీవితం ఆయనకే అర్థం కావట్లేదన్నారు.

ఆయనవి దిశా, దిక్కు లేని రాజకీయాలని ఎద్దేవా చేశారు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ.. రాజకీయాల్లో క్యారెక్టర్ పోతే తిరిగి సంపాదించుకోలేమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పొంగులేటి రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సలహాలిచ్చారు. బీఆర్ఎస్ ను వదిలి వెళ్లినవారు విజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. వ్యక్తిగత దూషణలతో బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లేందుకు ప్రయత్నం చేయవద్దని సూచించారు. నిన్న, మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పదువుల అనుభవించి పొంగులేటి పిలువగానే వెళ్లిపోయారని పేర్కొన్నారు.

వైరాలో రెండు, మూడు తరాలు రాజకీయాలు చేస్తున్న బొర్రా కుటుంబంలోని రాజశేఖర్ ను పార్టీ రాష్ట్ర స్థాయి పదవిని కట్టబెట్టిందన్నారు. పార్టీని వీడిన వారు మరోసారి పునరాలోచించుకోవాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వైరా ఎంపీపీ వేల్పుల పావని, కొణిజర్ల జడ్పీటీసీ, పోట్ల కవిత, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు బాణాలు వెంకటేశ్వరరావు, మద్దెల రవి, నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు, పొట్ల శ్రీనివాసరావు, కట్టా కృష్ణర్జునరావు, పసుపులేటి మోహన్రావు, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Next Story