ఖమ్మం జిల్లాలో కురుక్షేత్రం

by Disha Web Desk 15 |
ఖమ్మం జిల్లాలో కురుక్షేత్రం
X

దిశ, ఖమ్మం రూరల్ : కురుక్షేత్రం రాబోతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, అప్పుడే తెలంగాణలో ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలో గల రాష్ట్ర పీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వరరావు ఇంటికి పొంగులేటి మార్యదపూర్వకంగా వెళ్లారు. పాలేరులో కష్ట సమయంలో కూడా పార్టీని వీడకుండా అంటిపెట్టుకున్న నాయకుడు రాయల అని అన్నారు. ఆయన ఒడిపోతానని తెలిసి కూడా ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారని, కష్టాల్లో ఆయన ఎలా పాలు పంచుకున్నారో సుఖాల్లో కూడా పాలు పంచుకునేలా చేస్తాం అన్నారు. భవిష్యత్తులో

రాయలకు సముచిత స్థానం పార్టీ కల్పిస్తుందన్నారు. వందలాది మంది బీఆర్ఎస్ సర్పంచ్ లు, కార్పొరేటర్లు, నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని ఆయన తెలిపారు. 18 వ తేదీ నుండి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ములుగు జిల్లా నుండి బస్ యాత్ర నిర్వహిస్తారని, కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువత జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆయన విమర్శించారు. యువత ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 55 మందికి సీట్లు ప్రకటించిందని , నిజాయితీతో యుద్ధంలోకి దిగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అంతా కాంగ్రెస్ పార్టీని చూసి కాపీ కొట్టింది అని పేర్కొన్నారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చేలా కృషి : రాయల

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కూర్చొని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేలా చర్చలు చేస్తాం అని రాయల స్పష్టం చేశారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, చావా రామక్రిష్ణ, ఆర్. నరేష్​రెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి, రమేష్​రెడ్డి, కేతినేని వేణు, మంకెన వాసు పాల్గొన్నారు.

Next Story

Most Viewed