Rahul Gandhi : కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

by Disha Web Desk 15 |
Rahul Gandhi : కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
X

దిశ, మణుగూరు : బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలు బతకలేకపోతున్నారని, కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు సంపాదించారని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్ లో ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోడ్ షో కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశ పెట్టిన స్కీమ్ లన్నీ స్క్యామ్ లే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లపైగా అప్పుల పాలు చేశారని పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులే ప్రజలకు పంచుతున్నారు అన్నారు. తెలంగాణ పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను తీసుకువచ్చిందన్నారు.

వాటితో పేద ప్రజలను ఆరోగ్యంగా చూసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉంది కేసీఆర్ ఇంట్లో తప్ప పేదల ఇంట్లో కాదన్నారు. స్కీమ్ లు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు తప్ప పేద ప్రజలకు కాదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మద్యం, మైన్స్, ప్రాజెక్టుల దందా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడే కేసీఆర్ ఆయన చదువుకున్న స్కూల్ కాంగ్రెస్ పార్టీ కట్టించిందేనని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పే ఆరు గ్యారంటీలు తప్పక అమలు చేస్తామన్నారు. యువతకు లక్షల ఉద్ద్యోగాలు కల్పిస్తామన్నారు. కేసీఆర్ తో పాటు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు తిన్న లక్షల రూపాయలు కక్కించి పేద ప్రజలకు పంచుతామని అన్నారు. కేసీఆర్ నీ టైం దగ్గర పడిందని, ప్రజలే ఆయన్ని ఉరికిస్తారని ధ్వజమెత్తారు. ఈ రోడ్ షో లో పినపాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వేంకటేశ్వర్లు, మాజీ మంత్రి బలరాం నాయక్, తుళ్లూరి బ్రమ్మయ్య, కరివేద వెంకటేశ్వర్లు, పుచ్చకాయల శంకర్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed