మెప్మాలో అక్రమ గ్రూపులు.. ఇష్టారాజ్యంగా రుణాలు

by Malleboina Mahesh |

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా మహిళా సంఘాలకు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తోంది.

మెప్మాలో అక్రమ గ్రూపులు.. ఇష్టారాజ్యంగా రుణాలు
X

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు తీసుకుని స్వాహా చేయడం, వీధి వ్యాపారుల రుణాల మంజూరు విషయంలో చేతివాటం చూపడంతో మెప్మా అసలు లక్ష్యం పక్కదారి పడుతోంది. గతేడాది నకిలీ సభ్యులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అసలు సభ్యులు లేకుండానే ఫొటోలు, సంతకాలు పెట్టి, నగరంలోని ఒక బ్యాంకు నుంచి రూ.20 లక్షలు రుణం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి వరకు ఒక కిస్తీ కూడా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు మెప్మా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గప్‌చుప్‌గా మెప్మా అధికారులు రంగంలోకి దిగి, స్వాహా చేసిన సొమ్ము రికవరీ చేసేందుకు నానా తంటాలు పడి ఎలాగోలా కిస్తీలు కట్టించారు. అయితే అక్రమార్కులపై చర్యలు మాత్రం తీసుకోలేదు. వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం మెప్మా ద్వారా రుణాలు అందజేయగా, ఈ రుణాల మంజూరులో సైతం అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తీసుకువచ్చిన వారిని సైతం వీధి వ్యాపారులుగా ఆన్‌లైన్ చేసి రుణాలు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. ఆన్‌లైన్ చేసేటప్పుడు కొంత సొమ్ము వసూలు చేశారనే విషయం చర్చకు జరిగింది. ఇలా ప్రతి పనిలోనూ మెప్మా అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా మహిళా సంఘాలకు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తోంది. అయితే మెప్మాలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తున్నది. అక్రమంగా గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు తీసుకుని స్వాహా చేయడం, వీధి వ్యాపారుల రుణాల మంజూరు విషయంలో చేతివాటం చూపడం తదితర పనులతో మెప్మా అసలు లక్ష్యం పక్కదారి పడుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల మెప్మా అధికారులు అత్యుత్సాహంతో వీధి వ్యాపారుల ప్రాంగణంలో వివాదాలు మొదలయ్యాయని బహిరంగ వ్యాఖ్యలు వస్తున్నాయి.

నకిలీ సభ్యులతో గ్రూపులు..

నకిలీ సభ్యులతో కొందరు మహిళా సంఘాల గ్రూపుల్లో ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు పొందుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. గతేడాది నకిలీ సభ్యులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అసలు సభ్యులు లేకుండానే ఫొటోలు, సంతకాలు పెట్టి, నగరంలోని ఒక బ్యాంకు నుంచి రూ.20 లక్షలు రుణం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి వరకు ఒక కిస్తీ కూడా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు మెప్మా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గప్‌చుప్‌గా మెప్మా అధికారులు రంగంలోకి దిగారు. స్వాహా చేసిన సొమ్ము రికవరీ చేసేందుకు నానా తంటాలు పడి ఎలాగోలా కిస్తీలు కట్టించారు. అయితే అక్రమార్కులపై చర్యలు మాత్రం తీసుకోలేదు. అలాగే సభ్యుల నుంచి వాయిదాలు చెల్లించేందుకు సొమ్ములు తీసుకోవడం వాటిని సొంత అవసరాలకు వాడుకోవడం పరిపాటిగా మారింది. ఇది బయట పడ్డప్పుడు సెటిల్మెంట్లు చేయడం తర్వాత మౌనంగా ఉంటున్నారు. అక్రమార్కులపై చర్యలు లేకపోవడంతో వారు మళ్లీ మళ్లీ అక్రమాలకు పాల్పడుతున్నారు

వీధి వ్యాపారుల రుణ మంజూరులో ఇంతే..

వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం మెప్మా ద్వారా రుణాలు అందజేసింది. ఈ రుణాల మంజూరులో సైతం అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి మెప్మా రిసార్ట్స్ పర్సన్స్ వీధి వ్యాపారులను గుర్తించి, వారికి గుర్తింపు కార్డు ఇచ్చి తర్వాత రుణ మంజూరు కోసం ఆన్‌లైన్ చేయాలి. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తీసుకువచ్చిన వారిని సైతం వీధి వ్యాపారులుగా ఆన్‌లైన్ చేసి రుణాలు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. ఆన్‌లైన్ చేసేటప్పుడు కొంత సొమ్ము వసూలు చేశారనే విషయం చర్చకు వచ్చింది. ఇలా ప్రతి పనిలోనూ మెప్మా అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వీధి వ్యాపారుల ప్రాంగణంలో వివాదాలు

మెప్మా అధికారులు అత్యుత్సాహం నగరంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంలో వివాదానికి కారణమైందంటున్నారు. ఎక్కడా లేనివిధంగా డిపాజిట్లు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఇష్టారీతిగా వ్యవహరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మెప్మా అధికారుల వ్యవహార తీరు పై దృష్టి పెడితే అక్రమాలు జరగవని పలువురు బహిరంగంగానే అంటున్నారు.

మెప్మాలో అవినీతి జరగకుండా చర్యలు

మెప్మాలో అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ వ్యక్తులు తీసుకు వచ్చే వీధి వ్యాపారుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదు. మెప్మా ఆర్పీల ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేస్తున్నాం. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాల విషయంలో అన్ని వివరాలు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే బ్యాంకులకు పంపుతున్నాం.:- మెప్మా జిల్లా కోఆర్డినేటర్ సుజాత

Next Story