నేలవాలిన ఆశలు

by Dishanational1 |
నేలవాలిన ఆశలు
X

దిశ, వైరా: ఇటీవల కురిసిన అకాల వర్షాలు జిల్లాలోని అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. పండగపూట తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షానికి అతలాకుతలం కావడంతో అన్నదాతలు కన్నీటిపర్యంతం అవుతున్నారు. పంటలు దెబ్బతిన్న పొలాలను చూస్తూ అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో ప్రధానంగా మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కంకి వేసి, విత్తనాలు పాలు పోసుకునే సమయంలో వర్షం పంటలను కోలుకోలేని దెబ్బతీసింది. ఈదురు గాలులకు మొక్కజొన్న పంట మొత్తం నేలవాలాయి. దీంతో ఏమి చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నేలవాలిన మొక్కజొన్న పంటను ఎలా రక్షించుకోవాలో తెలియక మనోవేదనకు గురవుతున్నారు. జిల్లాలో అత్యధిక ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లగా, స్వల్పంగా పెసర, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.


ఖమ్మం జిల్లాలో 31038 ఎకరాల్లో పంట నష్టం

అకాల వర్షాలకు ఖమ్మం జిల్లాలో31038 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా 19552 మంది రైతులకు సంబంధించిన 30792 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బ తిన్నది. మరో 171 మంది రైతులు 226 ఎకరాల్లో పండించిన పెసర పంట వర్షార్పణం అయింది. మరో 9 మంది రైతులు 20 ఎకరాల్లో సాగు చేసిన పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కూసుమంచి, మధిర, సత్తుపల్లి, వైరా వ్యవసాయ సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ అకాల వర్షాలకు మధిర వ్యవసాయ డివిజన్లో అత్యధికంగా 15,860 మంది రైతులకు సంబంధించిన 21978 ఎకరాల్లో పంటలు వర్షానికి దెబ్బతిన్నాయి. ఖమ్మం వ్యవసాయ డివిజన్లో 461మంది రైతులు సాగు చేస్తున్న 731ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కూసుమంచి వ్యవసాయ సబ్ డివిజన్లో 299 మంది రైతులు సాగు చేస్తున్న 566 ఎకరాల్లో పంటలు వర్షార్పణమయ్యాయి. వైరా వ్యవసాయ సబ్ డివిజన్లో 2904 మంది రైతులు సాగు చేస్తున్న 7350 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. సత్తుపల్లి డివిజన్లో 250 మంది రైతులు సాగు చేస్తున్న 413 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లా వ్యవసాయ అధికారులు 31038 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారికంగా ప్రకటించారు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

రూ.80.50 కోట్ల పెట్టుబడి నష్టం

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు రైతులు పెట్టిన పెట్టుబడి సుమారు 80.50 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఓ అంచనా. ఎకరా మొక్కజొన్న పంటకు రూ.26 వేల వరకు పెట్టుబడే అవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో 30792 ఎకరాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటకు 80 కోట్ల 5 లక్షల రూపాయలు పైగానే పెట్టుబడి నష్టం వాటిల్లింది. పెసర పంట ఎకరాకు రూ.15వేలు పైగానే పెట్టుబడి అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 226 ఎకరాలకు సుమారు రూ.35 లక్షలకు లక్ష రూపాయలు రైతులు పెట్టుబడి పెట్టారు. ఇతర పంటలు 20 ఎకరాలకు సుమారు రూ.5లక్షలకు పైగానే రైతులు పెట్టుబడి పెట్టారు. ఇలా అన్ని పంటలను పరిగణలోకి తీసుకుంటే అన్నదాతలకు సుమారు రూ. 80.50 కోట్లు పెట్టుబడి రూపంలో వస్తుందని ఓ అంచనా. ఇది ఇలా ఉంటే పొలాలను కౌలుకు తీసుకున్న కౌలు రైతులకు మరింత అదనంగా నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలు నష్టపోయిన అన్నదాతలకు నష్టపరిహారం అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

పదెకరాల్లో మొక్కజొన్న పంటను నష్టపోయా: బండి గోపాలకృష్ణ, రైతు, తాటిపూడి

ప్రస్తుత యాసింగిలో పదెకరాల్లో మొక్క జొన్న పంట సాగు చేస్తున్నా. ఇటీవల కురిసిన వర్షాలకు కంకి వేసి, విత్తనాలు పాలు పోసుకునే దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలవాలింది. ఎకరానికి రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టా. పంట నేలవాలడంతో పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి.

Next Story