కరకవాగులో భూ రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్

by Taduka Kalyani |

పాల్వంచ మండలం కరకవాగు గ్రామంలోని సర్వే నెం.727లో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కరకవాగులో భూ రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్
X

దిశ :పాల్వంచ రూరల్ : పాల్వంచ మండలం కరకవాగు గ్రామంలోని సర్వే నెం.727లో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భూ రీ-సర్వే పనుల పురోగతి, చేపడుతున్న విధానం, భూముల హద్దుల నిర్ధారణ ప్రక్రియపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందిస్తూ ప్రస్తుతం ప్రతిరోజూ 42 నుండి 50 ఎకరాల వరకు భూములకు రీ-సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 580 ఎకరాల భూములకు రీ-సర్వే పూర్తి చేసినట్లు, ఇంకా సుమారు 705 ఎకరాల భూములకు రీ-సర్వే చేపట్టాల్సి ఉందని వివరించారు.

నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. భూ రీ-సర్వే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకత, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి భూమి హద్దును సంబంధిత రైతుల సమక్షంలోనే గుర్తించి, ఎలాంటి వివాదాలకు తావులేకుండా సర్వే నిర్వహించాలని తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ అధికారులు నిర్వహించే భూ రీ సర్వేకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. భూ రీ-సర్వే పూర్తయితే భూముల హద్దులపై స్పష్టత ఏర్పడి, భూ వివాదాలు తగ్గడంతో పాటు భూ రికార్డులు మరింత పారదర్శకంగా మారుతాయని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాల్వంచ తహసీల్దార్ ధారా ప్రసాద్, సర్వేయర్లు, రైతులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story