మధిర బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ

by Disha Web Desk 20 |
మధిర బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ
X

దిశ, మధిర : బీఆర్ఎస్ పార్టీ తరఫున మధిర ఎమ్మెల్యే అభ్యర్థిగా లింగాల కమల్ రాజును ప్రకటించిన విషయం విధితమే. లింగాల కమల్ రాజు వర్గీయులు ఆనందోత్సవాలతో ఉన్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ బయటకు వచ్చింది. మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన ఉద్యమకారులకు న్యాయం జరుగ లేదంటూ, ప్రతి ఎన్నికల సమయంలో హామీలు ఇస్తూ కాలం వెళ్ళ దిస్తూ ఉద్యమకారులకు మొండిచేయి చూపిస్తున్నారని నిరాశతో చేసేది ఏమీ లేక ఏళ్ల తరబడి పార్టీ అభివృద్ధికి పాటుపడటమే తప్ప ప్రతిఫలం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో పాల్గొని తెలంగాణ విముక్తి కోసం పోరాడి, పార్టీ అభివృద్ధికి సాయి శక్తుల శ్రమించి ఒక సైనికుల పనిచేసిన వ్యక్తిని, ఉద్యమ కారుని ప్రతిసారి ఆశ చూపి, తీరా సమయం వచ్చేసరికి మాట దాటేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి కన్నీరు పెట్టుకున్నారు. దీంతో మధిర బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ బయటపడింది.

మధిర అసెంబ్లీ స్థానాన్ని ఎస్సీ మాదిగ కులానికి చెందిన అభ్యర్థికి కేటాయించాలని పలుమార్లు విన్నవించుకున్న ఇస్తామని చెప్పి, ఆశ చూపి నిరాశ పరుస్తున్నారు. మధిర నియోజకవర్గంలో ఎస్సీలో మాదిగ కులానికి చెందినా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, మాదిగ కులానికి చెందిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందన్నారు. మధిర నియోజకవర్గం లో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కారణం, బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి ఒకపక్క మాదిగ కులానికి చెందిన వారికి టికెట్ ఇవ్వకపోవడం ఒక కారణం అన్నారు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాదిగ కులానికి చెందిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అటు ఉద్యమ కాలంలో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేశానని, అంతేకాకుండా ఎస్సీ మాదిగ కులానికి చెందిన వాడిని కాబట్టి బిఆర్ఎస్ పార్టీ తరఫున మధిరలో పోటీ చేయడానికి బీ ఫారం ఇవ్వాలని కోరారు. తనకు న్యాయం జరిగే వరకూ అమరవీరుల స్థూపం వద్ద నిరసన దీక్ష కొనసాగిస్తానని అన్నారు.

Next Story

Most Viewed