డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేయాలి: మంత్రి తుమ్మల

by Kodari Anjali |

ఖమ్మం పాకబండలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి, మంత్రి తుమ్మల ప్రారంభించారు.

డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేయాలి: మంత్రి తుమ్మల
X

దిశ, ఖమ్మం: పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌళిక వసతులను నిరంతరం విస్తరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ఆదివారం ఖమ్మం నగరంలోని పాకబండ వద్ద నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎన్‌పీడీసీఎల్) ఆధ్వర్యంలో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉపకేంద్రంలోని కంట్రోల్ రూమ్, ఆధునిక పరికరాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రికి అధికారులు సాంకేతిక వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపకేంద్రాన్ని నిర్మించడం జరిగిందని, కంట్రోల్ రూమ్ నుంచే నిర్వహించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఖమ్మం జిల్లాలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినప్పటికీ వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలు సహా అన్ని రంగాలకు ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం..

2023లో రాష్ట్ర పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లు ఉండగా ప్రస్తుతం 18,548 మెగావాట్లకు పెరిగిందన్నారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ, పరిశ్రమలు, ఫార్మాసిటీ, డేటా సెంటర్లు, వ్యవసాయ రంగ విస్తరణ వంటి కారణాలతో భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు మరింత పెరుగుతాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి 2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని 85 గ్రామాలను పూర్తిస్థాయి సోలార్ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బోనకల్ మండలంలో సోలార్ ఆధారిత విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గిరిజనుల భూముల సాగుదారులకు ఇందిరా గిరి జల వికాస పథకం క్రింద సుమారు 6 లక్షల ఎకరాలకు సోలార్ పంపుసెట్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాల్లో సుమారు 3,500 మెగావాట్ల మేర డిమాండ్ పెరిగినా రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు విధించలేదన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత పరిస్థితులు ఉన్నప్పటికీ తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఉచిత విద్యుత్‌పై జరుగుతున్న దుష్ప్రచారాలను..

ఖమ్మం నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అవసరమైన మేరకు కొత్త విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపితే వెంటనే పరిశీలించి మంజూరు చేస్తామని చెప్పారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందని, రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం ప్రతి నెల 1150 కోట్ల భారీ మొత్తంలో సబ్సిడీ అందిస్తోందన్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక రైతు డిస్కం ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉచిత విద్యుత్‌పై జరుగుతున్న దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దని సూచించారు. గ్రామాల్లో విద్యుత్ వైర్లు, స్తంభాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా లూజ్ వైర్లను వెంటనే బిగించే చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా కోటి రూపాయల ప్రమాద బీమా కల్పించామని తెలిపారు.

ప్రభుత్వ ఆధీనంలో ఖాళీగా ఉన్న భూముల్లో..

అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.... ఖమ్మం నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఉపకేంద్రాలు, ట్రాన్స్‌మిషన్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను సూచించారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాల తరలింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్లు, భవనాలు, విద్యుత్, మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తవుతాయని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఖాళీగా ఉన్న భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఖాదర్ బాబా, ఎన్పిడిసియల్ ఎస్ఈ శ్రీనివాస చారి, మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story