భయపడేదే లేదు.. సెటిల్మెంట్లు, బెదిరించడమే బెల్లం వేణు చరిత్ర..?: సీపీఐ

by Dishafeatures2 |
భయపడేదే లేదు.. సెటిల్మెంట్లు, బెదిరించడమే బెల్లం వేణు చరిత్ర..?: సీపీఐ
X

దిశ, ఖమ్మం రూరల్ : ప్రశాంతంగా ఉన్న మండలంలో చిచ్చు పెడితే సహించేది లేదని, పద్ధతి మార్చుకోకపోతే తగిన సమాధానం చెప్పక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహ్మద్ మౌలానా హెచ్చరించారు. కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఏమిటో తెలుసుకుంటే మంచిదని, లేకపోతే తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి పబ్బం గడుపుకునే నాయకులు కమ్యూనిస్టు పార్టీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. శనివారం ఏదులాపురంలోని జీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెల్లం వేణు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని సెటిల్మెంట్లు, బెదిరించడం రాజకీయాలు కాదని ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు.

మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీపీఐకి ఉందన్నారు. వార్త కార్యాలయం పక్కన ఆక్రమించిన భూమి సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలేపల్లి ముగ్గు బొందల గుట్ట ఆక్రమణలో నీ పాత్ర ఏమిటో మండల ప్రజలకు తెలుసునన్నారు. ప్రశాంతతను కోరుకునే కమ్యూనిస్టు పార్టీ దోపిడీ, కబ్జాలకు వ్యతిరేకమన్నారు. ఇతరులపై వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నీ నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

కేసులకు భయపడేది లేదు - పోరాటం ఆపేది లేదు : దండి

కేసులకు భయపడేది లేదని, ప్రజల పక్షాన తమ పోరాటాలను కూడా ఆపేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అన్నారు. మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ.. కొంత మంది అధికారులను అడ్డం పెట్టుకుని కబ్జాకోరులను వెంటేసుకుని ముఠా నాయకుడిలా వ్యవహరించే వారికి తగు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు ఒక ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నారని, ఏదులాపురం సొసైటీని ఆయన పార్టీకి అప్పగిస్తే కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. దమ్ముంటే ఏదులాపురం సొసైటీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సురేష్ సవాల్ విసిరారు.

గ్రీన్ బెల్ట్‌కు సంబంధించి అనవసర ఆరోపణలు చేశారని, సీపీఐ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదని, వేణు అనుచరులు వ్యాపారం చేస్తున్నారని, గ్రీన్ ల్యాండ్ స్థలాల గురించి తన చుట్టూ ఉన్న వారిని ప్రశ్నిస్తే మంచిదని అన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా వ్యక్తిగతంగా తాను కానీ తన కుటుంబం కానీ లబ్ధి పొందినట్లుగా ఉంటే ఏ విచారణకైనా సిద్ధమన్నారు. 193 సర్వే నెంబరులో వేణుకు భూమి ఎలా వచ్చిందో చెప్పి ముక్కు నేలకు రాయాలని దండి సురేష్ డిమాండ్ చేశారు. బెల్లం వేణు చుట్టూ కబ్జాకోరులే ఉన్నారని పోలేపల్లి సర్వే నెం.156లో ఒక ప్రభుత్వ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుని కొందరు గ్రానైట్ వ్యాపారం చేసుకుంటుంటే దానికి పట్టా ఎవరు ఇచ్చారని సురేష్ ప్రశ్నించారు.

నీ ముఠా సభ్యులు కొందరు ఆ ప్రాంతంలో మోటార్లను ధ్వంసం చేసి బెదిరింపులకు గురి చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సర్వే నెం. 126 లోని గురుదక్షిణ ఫౌండేషన్లో రెండు ఎకరాల ఆక్రమణకు ప్రయత్నిస్తున్నది నీ అనుచరులు కాదా అన్నారు. చింతపల్లి గ్రామంలో కుమ్మరికుంట శిఖాన్ని ఆక్రమిస్తే ఐబీ అధికారులు మీ నాయకులపై కేసు నమోదు చేసింది వాస్తవం కాదా అన్నారు. సారా బట్టీలో గుమస్తాగా పనిచేసిన వేణు గ్లాసులు కడిగిన వ్యక్తి ఎలా ఆర్థికంగా ఎదిగడాని ఆయన డిమాండ్ చేశారు. తన ఆస్తులకు సంబంధించి ఏ చర్చకైనా తాను సిద్ధమని, ముందుకు రావాల్సింది బెల్లం వేణు ముఠాయే అని ఆయన అన్నారు.

రూరల్ సీఐ సారూ పద్ధతి మార్చుకోండి

రూరల్ సీఐ శ్రీనివాసరావు తన పద్ధతి మార్చుకోవాలని, బెల్లం వేణు ప్రోద్బలంతో అక్రమ కేసులు పెడుతూ సీపీఐ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని సురేష్ ఆరోపించారు. దొంగ రాళ్ల వ్యాపారులతో ఫోటోలకు ఫోజులిచ్చే సీఐకి ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులతో మాట్లాడేందుకు సిగ్గు అనిపిస్తుందా అని ప్రశ్నించారు. లెప్రసీ కాలనీలో సీఐ ప్రోద్భలంతోనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారని దీనిపై ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇటీవల జరిగిన కృష్ణయ్య హత్య విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తమను భయపెట్టేందుకు సీఐ ప్రయత్నిస్తున్నారన్నారు.

ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కర్ణకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మిడికంటి వెంకటరెడ్డి, అజ్మీర రామ్మూర్తి, జిల్లా నాయకులు పుచ్చకాయల సుధాకర్రావు, ఉన్నం రంగారావు, చెరుకుపల్లి భాస్కర్, మేళ్ళచేర్వు లలిత, పగ్గిళ్ల వీరభద్రం, బోజడ్ల సూర్యారావు, పలువురు జిల్లా సమితి సభ్యులు, ఎంపిటిసిలు, సర్పంచులు, మండల కార్యవర్గ సభ్యులు, పలువురు బెల్లం వేణు బాధితులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed