ప్రజల గుండెల నుండి కేసీఆర్‌ను వేరు చేయలేరు.. ఈసీ నిషేధంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
ప్రజల గుండెల నుండి కేసీఆర్‌ను వేరు చేయలేరు.. ఈసీ నిషేధంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: 48 గంటల పాటు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్‌పై ఈసీ బ్యాన్ విధించడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మత విద్వేషాలు రెచ్చగొడితే ఈసీకి కనిపించదు.. సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడిన ఈసీకి కనపించదు.. కేసీఆర్ హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే నిషేధం విధించారని అసహనం వ్యక్తం చేశారు. నిషేధం విధించినా.. ప్రజల గుండెల నుండి కేసీఆర్‌ను వేరు చేయలేరని అన్నారు.

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్.. ‘కుక్కల కొడుకులు’ అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈసీ నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్.. ఆయనపై 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌లో ఉండగా కేసీఆర్‌పై ఈసీ 48 గంటల నిషేదం విధించడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story