డబుల్ విచారణకు ట్రబుల్..దోచుకున్న వారి నుంచి కక్కించే బాధ్యత లేదా?

by Dishanational2 |
డబుల్ విచారణకు ట్రబుల్..దోచుకున్న వారి నుంచి కక్కించే బాధ్యత లేదా?
X

ఖమ్మం నియోజకవర్గంలో వందల మందికి డబుల్ బెడ్ రూంలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లలో దోపిడీకి పాల్పడిన ముఠా దర్జాగా తిరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేయడంతో అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్యాయం చేసిన వారిని శిక్షించడానికి ఎందుకు వెనకడుగు వేస్తుందోనని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈవ్యవహారంలో బాధ్యులైన ఇద్దరు మహిళా ఉద్యోగులను తొలగించినా, అధికార పార్టీకి చెందిన ప్రతినిధిని ఇంకా కొనసాగించడంపై మండిపడుతున్నారు. అతను మంత్రి పేరు చెబుతూ పబ్బం గడుకుంటున్నాడు. కొంత మంది రిపోర్టర్లను పక్కన తిప్పుకుంటూ తాను ఏది చెబితే అది రాస్తారని పరోక్షంగా హెచ్చరిస్తూ ఖమ్మంలో తిష్ట వేశాడు. యూనియన్ నాయకులు సైతం తన ముందు జీరో అని, తాను లేకపోతే యూనియనే లేదనే స్థాయికి చేరాడు. ఇంత జరుగుతున్నా డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో మంత్రి పువ్వాడ మీనమేషాలు లెక్కించడంపై అసహనం వ్యక్తం అవుతున్నది. ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ఈ వ్యవహారం అధికార పార్టీ మెడకు చుట్టుకోనున్నదనే అభిప్రాయం వ్యక్తం అవుతన్నది.

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నియోజకవర్గంలో వందల మందికి డబుల్ బెడ్ రూంలు ఇప్పిస్తానని కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడిన ముఠా ఖమ్మంలో దర్జాగా తిరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేయడంతో ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్నది. ఇద్దరు మహిళలతో సహా అధికార పార్టీ యువ నాయకుడు, అధికార పార్టీకి చెందిన మీడియా ప్రతినిధి హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నియోజకవర్గానికి చెందిన వందలాది మంది ఓటర్లకు అన్యాయం చేసిన వారిపై అధికార పార్టీ చర్యలు తీసుకొని శిక్షించడానికి ఎందుకు వెనకడుగు వేస్తుందోనని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇద్దరు మహిళలను ఉద్యోగాల్లో నుంచి సస్పెండ్ చేశారు. కాని ఆ మీడియా ప్రతినిధిని కొనసాగిస్తున్నారు. అతను అధికార పార్టీ మీడియా సంస్థలో ఉంటే విచారణ ఎలా కొనసాగుతుందనే విషయాన్ని సంస్థకు తోడు అధికార పార్టీ ఆలోచిస్తూ కూర్చుంటే బాధిత కుటుంబాలకు న్యాయం దక్కేది ఎప్పుడని ప్రజలు మండి పడుతున్నారు.

నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే సహించని మంత్రి డబుల్ బెడ్ రూం విషయంలో మీనమేషాలు వేయడంపై ప్రజల్లో అసహనం ఏర్పడుతున్నది. కబ్జా వ్యవహరంలో సమీప బంధువులను సైతం ఉపేక్షించకుండా చివాట్లు పెట్టినా మంచి పేరు మంత్రికి ఉంది. నిజంగానే అమాత్యులు కాపాడుతున్నారా లేక రోజు మంత్రి చుట్టూ తిరిగి అధికారుల దృష్టిలో పడి మంత్రి పేరు బద్నాం చేస్తున్నాడనే దానిపై మంత్రి సైతం ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి వెళ్లినా మంత్రి పేరును వాడుతూ అధికారుల ముందు మంత్రిని అన్న అని సంభోదిస్తూ మంత్రి తనకు అస్తమానం కాల్ చేస్తారని చెప్పుకుంటూ పబ్బం గడుకుంటున్నాడు. కొంత మంది రిపోర్టర్లను పక్కన తిప్పుకుంటూ వీళ్లంతా తాను ఏది చెబితే అది రాస్తారని పరోక్షంగా హెచ్చరిస్తూ ఖమ్మంలో తిష్ట వేశాడు. యూనియన్ నాయకులు సైతం తన ముందు జీరో అంటూ బయట ప్రచారం చేసుకుంటున్నాడని సమాచారం. తాను లేకపోతే యూనియనే లేదనే స్థాయికి చేరాడు. ఓ ప్రధాన ఛానల్ అండ తో పక్కన ఉండే మిగతా జర్నలిస్టులకు సైతం ఈ మరక తాకుతుండటంతో వాళ్లు సైతం వెనక్కి తగ్గారు.

మంత్రి పేరు పదే పదే వాడుతున్నా ఇతన్ని చూసి అధికారులు సైతం బేజారెత్తుతున్నారు. డబుల్ బెడ్ రూం వ్యవహారం తేలేవరకు కలెక్టర్, ఎస్పీలు అవినీతి జర్నలిస్ట్‌ను దరి చేర్చొద్దని పలువురు కోరుతున్నారు. అమాత్యులు సైతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం వ్యవహారంలో ఇంత పెద్ద స్కామ్ జరగడాన్ని సీరియస్ గా తీసుకోకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో ఇది అధికార పార్టీకి మెడకు చుట్టుకోనుంది.

Next Story

Most Viewed