తిలా పాపం..... తలా పిరికెడు.. పోలీసుల విచారణలో ఆ ఇద్దరు పేర్లు

by Disha Web Desk 12 |
తిలా పాపం..... తలా పిరికెడు.. పోలీసుల విచారణలో ఆ ఇద్దరు పేర్లు
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం గ్రామంలో 90 వేల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంక్ కూల్చివేత వ్యవహారం తిలా పాపం.... తలా పిడికెడు చందంగా మారింది. కౌన్సిల్ తీర్మానం లేకుండా, మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రం మంజూరు చేయకుండానే ఈ మంచినీటి ట్యాంక్ ను కూల్చివేశారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఈ విషయమై ఫిబ్రవరి 22వ తేదీన 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

అంతేకాకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం గ్రామంలోని మంచి నీటి ట్యాంకును కూల్చివేశారని వైరా ఇన్చార్జి కమిషనర్ బి అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులకు ఈ మంచినీటి ట్యాంక్ కూల్చివేతలో మున్సిపాలిటీలోని ఇంటి దొంగలే కీలక పాత్ర పోషించారని విస్తుపోయే నిజాలు తెలిసినట్లు సమాచారం. మున్సిపాలిటీలోని ఓ ప్రజా ప్రతినిధితో పాటు ఓ అధికారి ఆదేశాలతో తాము మంచినీటి ట్యాంకును కూల్చి వేశామని పోలీసుల విచారణలో ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది.

కేసు నుంచి బయట పడేందుకు అధికారి తీవ్ర ప్రయత్నం

దొంగే.... దొంగ దొంగ అని అరిచిన చందంగా ఉంది మంచినీటి ట్యాంక్ కూల్చివేత వ్యవహారంలో ఓ అధికారి తీరు. ట్యాంక్ కూల్చివేతలో ఓ అధికారి హస్తం ఉన్నట్లు పోలీసు విచారణలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి చెప్పినట్లు సమాచారం. ఈ ట్యాంక్ కూల్చివేసి, స్థలాన్ని గతంలో దానం చేసిన వ్యక్తికి అప్పగించేలా మున్సిపాలిటీలో కీలక అధికారితో పాటు ఓ ప్రజాప్రతినిధి డీల్ కుదిరించారని స్పష్టంగా తెలుస్తుంది. ఈ డీల్ లో లక్షలాది రూపాయలు చేతులు మారాయని సమాచారం.

ఈ వ్యవహారం మొత్తం ఆ అధికారి కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. సదరు అధికారి ఆదేశాలతోనే ట్యాంక్ కూల్చివేత సమయంలో మున్సిపాలిటీ ట్రాక్టర్లు, జెసిబి తో పాటు మున్సిపాలిటీ సిబ్బంది అందరూ అక్కడే ఉండి అన్ని తామై పనిచేశారు. ఈ వాహనాలన్నీ ఆ అధికారి ఆదేశాలతోనే ట్యాంక్ కూల్చివేసే ప్రాంతానికి వెళ్లాయి. ఈ విషయం తీవ్ర వివాదం కావడంతో తన తప్పు ఏమీ లేదని ముందుగా అధికారి బిల్డప్ ఇచ్చినంత పని చేశారు.

చివరకు పోలీసు విచారణలో పూర్తి వివరాలు బహిర్గతం కావడంతో కేసు నుంచి తప్పించుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే ఒకసారి ఆ అధికారిని విచారించినట్లు తెలిసింది. అయితే పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆ అధికారి నుంచి మౌనమే సమాధానమైందని సమాచారం. అనంతరం రెండు సార్లు విచారణకు రావాలని పోలీసులు ఆ అధికారిని పిలిచినప్పటికీ పలు సాకులతో ఆ అధికారి హాజరు కాలేదని సమాచారం.

అయితే ఈ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అధికారి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన అధికార పార్టీలోని ఓ ముఖ్య ప్రజాప్రతినిధిని కలిసి తనది తప్పైందని.... ఈ ఒక్కసారి తనను కేసు నుంచి రక్షించాలని ఆ అధికారి శరణు వేడుకున్నట్లు సమాచారం. దీంతో ఆ అధికారిపై విచారణ సంబంధించిన ఒత్తిడి తగ్గినట్లు తెలుస్తోంది. అన్నీ తానై వ్యవహరించిన ఆ అధికారిని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు వైరాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

తనను కేసులో ఇరికించి ఆ అధికారి కేసు నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి తీవ్ర మనోవ్యధలో ఉన్నట్లు సమాచారం. ట్యాంక్ కుల్చివేతలో అధికారి హస్తం ఉన్నట్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగి బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే విషయంలో కీలక పాత్ర పోషించిన అధికారిపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తే ప్రభుత్వానికి, అధికారులకు మాయని మచ్చలా మారే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు చేసిన ఫిర్యాదు పై జరుగుతున్న విచారణ, కేసు నుంచి అధికారిని పక్కకు తప్పిస్తే ఆ పార్టీ ప్రతిష్టలు దిగజారి పోవడంతో పాటు రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఓ శాఖకు చెందిన అధికారులకు నోటీసులు మంజూరైన విషయంలో ఆ అధికారి కీలక పాత్ర పోషించారని వైరాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా ట్యాంక్ వ్యవహారంలో తప్పులు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తారా.. లేదంటే వదిలేస్తారో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed