తెలంగాణ విద్యార్థులకు విదేశీ వ్యవసాయ విద్యావకాశం.. PJTAU, సిడ్నీ యూనివర్సిటీల కీలక ఒప్పందం

by Ramesh Naini |

BSC(అగ్రికల్చర్) కోర్సుని సంయుక్తంగా అందించేందుకు వీలు కల్పించే కీలక ఒప్పందం పై రెండు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సంతకాలు చేశారు.

తెలంగాణ విద్యార్థులకు విదేశీ వ్యవసాయ విద్యావకాశం.. PJTAU, సిడ్నీ యూనివర్సిటీల కీలక ఒప్పందం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య నేతృత్వంలో విశ్వవిద్యాలయం డీన్స్ బృందం సిడ్నీలోని వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయాన్ని (WSU) సోమవారం సందర్శించింది. WSU వీసీ, ప్రెసిడెంట్ జార్జ్ విలియం AO, ఇతర అధికారులతో PJTAU బృందం అనేక అంశాలపై విస్తృత చర్చలు జరిపింది. BSC(అగ్రికల్చర్) కోర్సుని సంయుక్తంగా అందించేందుకు వీలు కల్పించే కీలక ఒప్పందం పై రెండు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సంతకాలు చేశారు. దేశంలోనే తొలిసారిగా అందించే ఈ నాలుగేళ్ల సంయుక్త కోర్సులో విద్యార్థులు మూడేళ్లు రాజేంద్రనగర్ లోని కళాశాలలోనూ, మరో ఏడాది WSU లోనూ విద్యను అభ్యసించే అవకాశం ఈ ఒప్పందం ద్వారా కలుగుతుంది. సుమారు 40 మంది తెలంగాణ విద్యార్థులు ఏడాది పాటు WSU లో చదువుకునే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పించనుందని PJTAU ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. అదే విధంగా ఆసక్తి కలిగిన విద్యార్థులు మరో ఏడాది చదివి MSC డిగ్రీ పొందే అవకాశం ఉందని జానయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

PJTAU లో చేపట్టిన వివిధ సంస్కరణల్లో భాగంగా ఈ ఒప్పందం ద్వారా విద్య, పరిశోధన విభాగాల్ని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానించి సంయుక్త పరిశోధనలు చేపట్టే అవకాశం కలుగుతుందని జానయ్య వివరించారు. ఈ సంయుక్త డిగ్రీ కోర్సులో ఇప్పటికే 25 మంది విద్యార్థులు చేరారని త్వరలో మరో 10 మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఈ కోర్సుని నిర్వహించనున్నట్లు జానయ్య తెలిపారు. అదేవిధంగా PJTAU అధికారుల బృందం WSU లోని వివిధ అధునాతన ప్రయోగశాలల్ని, పరిశోధనా విభాగాల్ని సందర్శించింది. వ్యవసాయ రంగంలో అగ్రి రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశోధనలకు సంబంధించి కూడా రెండు విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన కుదిరిందని అల్దాస్ జానయ్య వివరించారు.

ఈ కార్యక్రమంలో WSU ఉపకులపతి, ప్రెసిడెంట్ జార్జ్ విలియం AO, Pro VC ప్రొఫెసర్ ఇయాన్ అండర్సన్ ( రీసెర్చ్ అండ్ ఎంటర్ ప్రైజ్), Pro VC (ఎడ్యుకేషనల్ పార్టర్న్ షిప్స్ అండ్ క్వాలిటీ) డాక్టర్ నికోలెన్ ముర్డోఖ్, PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ K. ఝాన్సీ రాణి, పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠి బలరాం, విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ CH. వేణుగోపాల్ రెడ్డి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ KV రమణరావు, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ KB ఈశ్వరిలు పాల్గొన్నారు.

Next Story