కేసీఆర్ నోటు ఇక చెల్లదు.. బల్మూర్ వెంకట్ ఘాటు వ్యాఖ్యలు

by Ramesh Naini |

కేసీఆర్, బీఆర్ఎస్ అనే ఛాప్టర్ తెలంగాణలో ముగిసిన అధ్యాయమని, బీఆర్ఎస్ నాయ‌కుల‌ను కాపాడుకోవ‌డానికి కేసీఆర్ ప్రయ‌త్నాలు చేస్తున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు.

కేసీఆర్ నోటు ఇక చెల్లదు.. బల్మూర్ వెంకట్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్, బీఆర్ఎస్ అనే ఛాప్టర్ తెలంగాణలో ముగిసిన అధ్యాయమని, బీఆర్ఎస్ నాయ‌కుల‌ను కాపాడుకోవ‌డానికి కేసీఆర్ ప్రయ‌త్నాలు చేస్తున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. ప్రజ‌లు త‌ప్పు చేశార‌ని వాళ్లనే కేసీఆర్ త‌ప్పుప‌డుతున్నారని, కేసీఆర్ అనే నోటు చెల్లద‌ని తెలంగాణ ప్రజ‌లు చెప్పారు.. నెత్తినెక్కిన క‌ళ్లను కింద‌కు దింప‌డానికి కాంగ్రెస్‌కు ప్రజ‌లు అధికారం ఇచ్చారన్నారు. మంగళవారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. జీవ‌న్ రెడ్డి స్వార్థ రాజ‌కీయాల కోసం నీచాతి నీచంగా దిగ‌జారి మాట్లాడుతున్నారని, ఆయనకి కాంగ్రెస్ 14 సార్లు బీఫామ్ ఇచ్చి గౌర‌వించింది.. స్వార్థం కోసం తమ ప్రభుత్వం పైన జీవ‌న్ రెడ్డి మాట్లాడిన తీరు బాధాక‌రమని బల్మూర్ వెంకట్ విమర్శించారు. తెలంగాణ ప్రజ‌ల‌కు జీవ‌న్ రెడ్డి, కేసీఆర్ వ‌ల్ల ఒరిగేది ఏమీ లేదని, ఇలాంటి వ్యక్తుల‌ను తెలంగాణ ప్రజ‌లు మ‌ళ్లీ ఆశీర్వదిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. పాలు తాగి క‌న్నత‌ల్లి రొమ్ము గుద్దిన‌ట్లుగా జీవ‌న్ రెడ్డి తీరు ఉందని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వక‌పోతే ఆయన ఎక్కడ ఉండేవారని, ఎన్నో సార్లు ఓడిపోయినా పార్టీ టికెట్ ఇచ్చినా కూడా జీవ‌న్ రెడ్డిని జ‌గిత్యాల ప్రజ‌లే న‌మ్మడం లేదని బల్మూర్ వెంకట్ విమర్శించారు. 76 ఏళ్లు వ‌చ్చినా తానే రాజ‌కీయాల్లో ఉండాల‌ని జీవ‌న్ రెడ్డి అంటున్నారని, ఆయన సొంత కుటుంబ స‌భ్యులను, త‌న‌ ఇద్దరు కొడుకుల‌ను రాజ‌కీయంగా ఎద‌గ‌నివ్వలేదని ఆరోపించారు.

తెలంగాణ‌లో అధికారం మాదే..

బ‌తికి ఉన్నన్నని రోజులు తెలంగాణ‌లో అధికారం మాదే అని కేసీఆర్ కుటుంబం భావించిందని, అధికారం పోయింద‌న్న క‌డుపు మంట‌తో కేసీఆర్ మాట్లాడుతున్నారని బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. సొంత అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశార‌ని క‌న్న కూతురే ఆరోపించారని, క‌వితే బ‌య‌ట‌కు వ‌చ్చి రాక్షసులు తెలంగాణను ఆగం చేశార‌ని మాట్లాడుతున్నారని, సొంత బిడ్డనే విమ‌ర్శిస్తుంటే తెలంగాణ ప్రజ‌లు కేసీఆర్‌ను న‌మ్ముతారా అని ఆయన నిలదీశారు. గ‌జ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట‌ల్లో కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఓడిస్తామని, బీఆర్ఎస్ కు ప్రతిప‌క్ష హోదా కూడా లేకుండా చేస్తామని బల్మూర్ వెంకట్ సవాల్ విసిరారు. క‌ల్వకుంట్ల కుటుంబాన్ని క‌ట‌క‌టాల్లో పెట్టే హామీని మేం ఇంకా నేర‌వేర్చలేక‌పోయామని, త్వర‌లోనే ఈ హామీని కూడా నేర‌వేర‌స్తామ‌న్న న‌మ్మకం ఉంది.. చ‌ర్లపల్లి లేదా చంచ‌ల్ గూడలో పెడ‌తామన్నారు. హ‌రీష్ రావు ఢిల్లీ టూర్ ఒక డ్రామా.. ఇద్దరి మ‌ధ్య గొడ‌వ‌ల కార‌ణంగానే హ‌రీష్ రావును ప‌క్కకు పంపారని, ఆయన బీఆర్ఎస్ లో కొన‌సాగే అవ‌కాశం లేదన్నారు. బీజేపీ నాయ‌కుల‌తో యేడాది కాలంగా హ‌రీష్ రావు ట‌చ్ లో ఉన్నార‌ని ఆయ‌న ద‌గ్గరి వ్యక్తులు చెపుతున్నారని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. కేసీఆర్ బినామీలు, బీఆర్ఎస్ నాయ‌కులు ఆక్రమించిన భూముల‌ను హైడ్రా స్వాధీనం చేసుకుంటుందిని, అందుకే హైడ్రాను జీర్ణియించుకోలేక క‌డుపు మంట‌తో కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని కేసీఆర్ ఊహాలోకంలో విహ‌రిస్తున్నారని, తన సొంత నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వేల్ లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ఒక్క కార్యక్రమంలో ఆయన పాల్గొన‌లేదని, తమ ఎమ్మెల్యే ఎక్కడ అని గ‌జ్వేల్ ప్రజ‌లు అడుగుతున్నారని బల్మూర్ వెంకట్ విమర్శించారు.

Next Story